Nandus World Case: ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ‘నందూస్ వరల్డ్’ (Nandus World) యూట్యూబ్ ఛానల్ నిర్వాహకురాలు రమానందన (నందు) ఆమె భర్త మధుకర్ చిక్కుల్లో పడ్డారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, వీసా రెన్యువల్స్ చేస్తామని నమ్మించి పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసగించారనే ఆరోపణలపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వీరిపై చీటింగ్ కేసు నమోదైంది.
పోలీసుల కథనం ప్రకారం.. రమానందన, ఆమె భర్త జాగర్లమూడి మధుకర్ దంపతులకు విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో ‘డెస్టినీ కన్సల్టెన్సీ’ పేరిట కార్యాలయాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో తమకున్న గుర్తింపును వాడుకుంటూ, విదేశాలకు వెళ్లాలనుకునే నిరుద్యోగులను, విద్యార్థులను వీరు ఆకర్షించేవారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ జిల్లా కొత్తూరుకు చెందిన శివ క్రాంతి కుమార్ అనే యువకుడు లండన్లో చదువుకుంటున్న సమయంలో మధుకర్తో పరిచయం ఏర్పడింది. చదువు పూర్తి చేసుకుని భారత్కు తిరిగి వచ్చిన శివ క్రాంతి కుమార్కు యూకేలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని, అలాగే వీసా రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేస్తామని మధుకర్ దంపతులు నమ్మబలికారు. ఇందుకు గాను బాధితుడి నుండి విడతల వారీగా సుమారు రూ. 15 లక్షల వరకు వసూలు చేశారు.
డబ్బులు తీసుకుని చాలా కాలం గడుస్తున్నా ఉద్యోగం ఇప్పించకపోగా, వీసా ప్రక్రియలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో బాధితుడు తన డబ్బులు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చాడు. దీనికి సదరు దంపతులు నిరాకరించడమే కాకుండా మొహం చాటేయడంతో, మోసపోయానని గ్రహించిన శివ క్రాంతి కుమార్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఇబ్రహీంపట్నం ఎస్ఐ రాజు.. డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ జాగర్లమూడి మధుకర్ను మొదటి నిందితుడిగా (A1), యూట్యూబర్ రమానందనను రెండో నిందితురాలిగా (A2), అలాగే గుంటూరుకు చెందిన మధుకర్ తండ్రి మోహన్రావును మూడో నిందితుడిగా (A3) చేర్చి కేసు నమోదు చేశారు.
Read also-Tanveer Ahmed: బాబర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు
కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితులకు నోటీసులు జారీ చేసినప్పటికీ వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదని సమాచారం. కాగా, తమపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ నిందితులు హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా, ప్రస్తుతం అది విచారణ దశలో ఉంది. ఈ దంపతుల చేతిలో ఇంకా ఎంతమంది బాధితులు మోసపోయారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం విచారణను ముమ్మరం చేశారు. సోషల్ మీడియా సెలబ్రిటీలుగా చలామణి అవుతూ ఇలాంటి మోసాలకు పాల్పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.