Nayanthara: తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో నయనతార సరికొత్త రికార్డు సృష్టించారు. ‘అరమ్’ (Aramm) చిత్రంలో తన అద్భుత నటనకు ఉత్తమ నటిగా అవార్డు అందుకోవడమే కాకుండా, తన నిర్మాణ సంస్థ ‘రౌడీ పిక్చర్స్’ నిర్మించిన ‘నెట్రికన్’, ‘కూజాంగల్’ చిత్రాలకు గానూ మరో రెండు అవార్డులను కైవసం చేసుకున్నారు. ఒకేసారి మూడు రాష్ట్ర అవార్డులను అందుకోవడంపై నయన్ ఎంతో భావోద్వేగానికి గురవుతూ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. వివరాలలోకి వెళితే ..
లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే కేవలం గ్లామర్ మాత్రమే కాదు, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అని మరోసారి నిరూపితమైంది. 2017లో వచ్చిన ‘అరమ్’ సినిమాలో కలెక్టర్ మతివధనిగా ఆమె చూపిన పర్ఫార్మెన్స్కు ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఉత్తమ నటి అవార్డును ప్రకటించింది. ఈ సందర్భంగా తన మూడు అవార్డులతో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ నయన్ మురిసిపోయారు. నటిగా ఒకటి, నిర్మాతగా రెండు.. ఇలా మొత్తం మూడు అవార్డులు ఒకేసారి తన ఇంటికి రావడం నిజంగా ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఇది ఆమె కష్టానికి, కథల ఎంపికలో ఆమె చూపే పట్టుకు దక్కిన గౌరవం అని ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
గోపి నైనార్ దర్శకత్వంలో వచ్చిన ‘అరమ్’ సినిమా అప్పట్లో ఒక సంచలనం. ఈ మూవీ తెలుగులో కర్తవ్యం అనే పేరుతో రిలీజ్ అయింది. ఇక బోర్వెల్లో పడిపోయిన చిన్నారిని రక్షించేందుకు ఒక జిల్లా కలెక్టర్ చేసే పోరాటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. కేవలం ఒక రెస్క్యూ ఆపరేషన్ మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొనే కనీస సౌకర్యాల లేమిని, వ్యవస్థలోని అవినీతిని ఈ సినిమా కళ్లకు కట్టినట్లు చూపించింది. కలెక్టర్ పాత్రలో నయనతార గంభీరమైన నటన ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. సామాజిక స్పృహ ఉన్న ఇటువంటి చిత్రాలకు రాష్ట్ర స్థాయి పురస్కారాలు దక్కడం సినిమా స్థాయిని మరింత పెంచుతుంది. అందుకే నయన్ ఈ విజయాన్ని ఎంతో ప్రత్యేకం అని చెబుతున్నారు.
ALSO READ:Khushboo: ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఖుష్బూ.. సినిమా డీటెయిల్స్ ఇవే!
ఇక లేడి సూపర్ స్టార్ ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ మూవీతో సూపర్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నది. ఇక ఇప్పుడు అవార్డుల ఆనందంలో ఉన్న ఆమె ప్రస్తుతం ఒక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మహేష్ నారాయణన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పేట్రియాట్’ మూవీ ఈ ఏడాది ఏప్రిల్ లో రిలీజ్ కానుంది. ఇందులో విశేషం ఏమిటంటే, మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి మరియు మోహన్లాల్ దాదాపు 18 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు. వీరితో పాటు ఫహద్ ఫాసిల్, రేవతి వంటి దిగ్గజాలు కూడా ఈ సినిమాలో భాగం కావడం విశేషం. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నటిగా, నిర్మాతగా నయన్ దూకుడు చూస్తుంటే ఆమె ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంటుందనిపిస్తోంది.