Nidhi Agerwal : గత బుధవారం హైదరాబాద్లోని లులు మాల్లో ‘ది రాజా సాబ్’ సినిమా రెండో పాట విడుదల కార్యక్రమం ఎంతటి అస్తవ్యస్తంగా జరిగిందో అందరికీ తెలిసిందే. సరైన భద్రత, ఈవెంట్ మేనేజ్మెంట్ లోపంతో భారీగా తరలివచ్చిన జనసందోహం మధ్య హీరోయిన్ నిధి అగర్వాల్ నలిగిపోయారు. జనాల తోపులాటలో ఆమె ఊపిరాడక ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొన్నారు. కొందరు ఆకతాయిలు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కూడా వార్తలు వచ్చాయి.
పోలీసుల సుమోటో కేసు
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కూకట్పల్లి పోలీసులు నిర్వాహకులు మరియు మాల్ యాజమాన్యంపై అనుమతులు తీసుకోలేదన్న కారణంతో సుమోటోగా కేసులు నమోదు చేశారు. విచారణలో భాగంగా పోలీసులు నిధి అగర్వాల్ను సంప్రదించి, ఆమెను అసౌకర్యానికి గురిచేసిన వారిపై ఫిర్యాదు చేయాలని కోరారు. అయితే, దీనికి నిధి ఏమాత్రం ఒప్పుకోలేదట. తనను ఇబ్బంది పెట్టిన వారిపై ఫిర్యాదు చేసే ప్రసక్తే లేదని ఆమె పోలీసులకు తెగేసి చెప్పినట్లు సమాచారం.
ఫ్యాన్స్ అంటే ప్రేమ..
పోలీసులు గట్టిగా అడిగినా, నిధి తన పాత ధోరణినే కనబరిచారు. అపరిచిత వ్యక్తులపై ఫిర్యాదు చేసి ప్రయోజనం లేదని భావించిందో, లేక తన అభిమానుల మీద కేసులు పెట్టడం ఇష్టం లేకనో కానీ, ఆమె మౌనంగా ఉండేందుకే మొగ్గు చూపారు. ఈ గందరగోళం తర్వాత కూడా ఆమె ఎక్కడా అసహనం వ్యక్తం చేయకుండా, సినిమా పాట గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి తన ప్రొఫెషనలిజాన్ని చాటుకున్నారు.
నిధి బంగారం అంటున్న నెటిజన్లు
సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్లో కఠినంగా ఉంటేనే ఆకతాయిలకు బుద్ధి వస్తుందని పోలీసులు భావిస్తున్నప్పటికీ, నిధి చూపిన సహనం మాత్రం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. నిధి అగర్వాల్ మనసు బంగారం అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిర్వాహకులు కనీస జాగ్రత్తలు తీసుకోవాలని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.