Jabardasth : బుల్లితెరపై నవ్వుల విందును వడ్డిస్తున్న పాపులర్ కామెడీ షో ‘జబర్దస్త్’ తాజా ప్రోమో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దాదాపు పుష్కర కాలంగా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ వేదికపైకి ఈసారి ‘శంబాల’ చిత్ర యూనిట్ అతిథులుగా విచ్చేశారు. హీరో ఆది సాయికుమార్, హీరోయిన్ అర్చన అయ్యర్ జబర్దస్త్ స్టేజ్పై సందడి చేయడమే కాకుండా, కమెడియన్లతో కలిసి స్కిట్లలో భాగమై అందరినీ నవ్వుల్లో ముంచెత్తారు.
ఆది సాయికుమార్ మాస్ ఎంట్రీ
శంబాల ప్రమోషన్లలో భాగంగా వచ్చిన ఆది సాయికుమార్, తన తండ్రి సాయికుమార్ కెరీర్లోనే ఐకానిక్ అయిన పోలీస్ స్టోరీ డైలాగ్ కనిపించే మూడు సింహాలు నీతికి, న్యాయానికి.. అంటూ చెప్పి స్టేజ్ను దడదడలాడించారు. ఆ వెంటనే విజయవాడకు చెందిన ఒక నిజమైన ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్తో కలిసి చేసిన స్కిట్ ఆద్యంతం వినోదాన్ని పంచింది.
బుల్లెట్ భాస్కర్ & ఆటో రాంప్రసాద్ పంచ్ పవర్
ట్రాఫిక్ నిబంధనల నేపథ్యంలో సాగిన స్కిట్లో బుల్లెట్ భాస్కర్, ఆటో రాంప్రసాద్ తమదైన శైలిలో పంచ్లు వేశారు. హీరోయిన్ అర్చనకు ఆది బైక్ నేర్పిస్తుండగా పోలీసులు ఆపడం, అక్కడ రాంప్రసాద్ వేసిన టైమింగ్ పంచ్లకు జడ్జీలతో పాటు గెస్ట్లు కూడా పడిపడి నవ్వుకున్నారు. ఇక సీనియర్ ఆర్టిస్ట్ అప్పారావు ఫోన్ డ్రామా స్కిట్కు మరో స్పెషల్ అట్రాక్షన్గా నిలిచింది.
దొరబాబు లాజిక్
హీరోయిన్ అర్చనకు నూకరాజు స్టేజ్ మీదే ప్రపోజ్ చేయడం, దానికి ఆమె ఇచ్చిన కస్టమర్ ఔట్ ఆఫ్ నెట్వర్క్ అనే రిప్లై నవ్వులు పూయించింది. ఇక దొరబాబు-రాంప్రసాద్ స్కిట్లో హీరో ఆది స్వయంగా పాలుపంచుకున్నారు. గర్ల్ ఫ్రెండ్తో గొడవ జరిగితే ఎలా కాంప్రమైజ్ చేస్తావని ఆది అడిగిన ప్రశ్నకు, దొరబాబు చెప్పిన గదిలో వేసి గడ పెట్టేస్తాను అనే వింత లాజిక్కు ఆది షాకై దండం పెట్టేయడం ఈ ప్రోమోకే హైలైట్గా నిలిచింది.