AR Rahman Border: కళకు, సంగీతానికి భౌగోళిక సరిహద్దులు లేవని నిరూపిస్తూ భారత్-పాకిస్థాన్ సరిహద్దు వద్ద ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ తమ రాబోయే చిత్రం ‘మై వాపస్ ఆవుంగా’ ప్రమోషన్స్లో భాగంగా పంజాబ్లోని అట్టారీ-వాఘా సరిహద్దును సందర్శించారు. అక్కడ జరిగిన “జై హో – ఎ మ్యూజికల్ సెల్యూట్ టు ది బ్రేవ్హార్ట్స్” అనే కార్యక్రమంలో ఏఆర్ రెహమాన్ సరిహద్దు వద్ద మొదటిసారిగా లైవ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సాద్ షేక్ అనే పాకిస్థానీ ఆర్టిస్ట్ , లాహోర్ నుండి దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి వారిని కలవడానికి సరిహద్దుకు చేరుకున్నాడు.
Read also-2026లో ‘పెద్ది’తర్వాత పెద్ద సినిమాలు లేనట్లే!.. టాలీవుడ్ స్టార్ హీరోల ‘నెక్స్ట్ లెవెల్’ లైనప్!
ఆ ఇద్దరు దిగ్గజాలను కలిసిన తర్వాత, సదరు అభిమాని ఇన్స్టాగ్రామ్లో ఒక సుదీర్ఘమైన, ఎమోషనల్ నోట్ను పంచుకున్నాడు.
20 నిమిషాల ప్రయాణం: “చాలా మంది లాహోర్ వాసులలాగే నేను కూడా ఇండియాకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటాను. ఆదివారం మధ్యాహ్నం ఇంతియాజ్ అలీ, ఏఆర్ రెహమాన్ సరిహద్దుకు వస్తున్నట్లు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూశాను. అంతే, కేవలం 20 నిమిషాల్లో గుల్బర్గ్ నుండి సరిహద్దుకు చేరుకున్నాను. ఈ ఇద్దరు కళాకారులు నా కళను ఎన్నేళ్లుగా ప్రభావితం చేశారో గుర్తుచేసుకోవడానికి ఆ 20 నిమిషాల సమయం సరిపోయింది.”
సరిహద్దులపై అభిప్రాయం: “నేను 2004 తర్వాత మళ్లీ సరిహద్దుకు రాలేదు. సరిహద్దులు ఎప్పుడూ స్నేహపూర్వకంగా, తెరిచి ఉంటేనే బాగుంటుంది. ఇటువైపు ఉన్నా, అటువైపు ఉన్నా అది పంజాబే.. ఒకే రకమైన ముఖాలు, ఒకే భాష, అంతా ఒకటే.”
ఇంతియాజ్ అలీతో సంభాషణ: “నేను సరిహద్దుకు చేరుకోగానే మా ఫ్రెండ్ ఒకరు నన్ను ‘జీరో పాయింట్’ (భారత్-పాక్ ప్రజలు మాట్లాడుకోవచ్చు కానీ తాకలేరు) వద్దకు తీసుకెళ్లారు. అక్కడ నాకు తెల్లటి ఉంగరాల జుట్టు కనిపించింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా ‘ఇంతియాజ్.. ఇంతియాజ్..’ అని గట్టిగా అరిచాను. ఆయన ఒక్కసారిగా వెనక్కి తిరిగారు.”
“నేను ఆయనతో మాట్లాడుతూ, పాకిస్థాన్లో మీ సినిమాలకు, కథలకు ఎంతమంది అభిమానులు ఉన్నారో, ఇక్కడ ఒక తరం దర్శకులను మీరెలా ప్రభావితం చేశారో చెప్పాను. ఆయన నవ్వుతూ కృతజ్ఞతలు తెలిపారు. ఒకరోజు ఖచ్చితంగా పాకిస్థాన్ వస్తానని ఇంతియాజ్ చెప్పారు.”
Read also-దురంధర్ పై పవన్ కళ్యాణ్ ఫీలింగ్..ఆ ఒక్కటే నాకు బాగా నచ్చింది..
ఆ సంభాషణ ముగిసే సమయంలో సదరు అభిమాని ఇంతియాజ్ అలీతో ఆయన సినిమా టైటిల్ అయిన “మై వాపస్ ఆవుంగా” (నేను తిరిగి వస్తాను) అని అన్నాడు. దాంతో అవతలి వైపు ఉన్న భారతీయ సైనికులు, ప్రజలు అందరూ ఒక్కసారిగా గట్టిగా చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. ఆ క్షణంలో రెండు దేశాల మధ్య ఉన్న గేట్లు, సరిహద్దులు కరిగిపోయినట్లు అనిపించిందని, అక్కడ “కళ మాత్రమే గెలిచింది” అని ఆ అభిమాని రాసుకొచ్చాడు.
ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన ‘మై వాపస్ ఆవుంగా’ సినిమా 1947 దేశ విభజన నేపథ్యంలో తెరకెక్కింది. ప్రేమ, జ్ఞాపకాలు, సొంతూరిపై ఉండే మమకారం అనే అంశాల చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇందులో దిల్జిత్ దోసాంజ్, వేదాంగ్ రైనా, షర్వారి, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.