Peddi Controversy: సినీ ఇండస్ట్రీలో మహిళలని కేవలం గ్లామర్ బొమ్మలుగానే చూపించడంపై ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున డిబేట్లు జరుగుతూనే ఉంటాయి. తాజాగా రామ్చరణ్ కథానాయకుడిగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ‘పెద్ది’ విడుదలైన తర్వాత ఈ డిబేట్ మరోసారి వార్తల్లో హైలెట్ అవుతుంది.
ఈ సినిమాలో కథానాయిక జాన్వీ కపూర్ పోషించిన ‘అచ్చియమ్మ’ పాత్రను చూపించిన తీరు ఎంత విమర్శల పాలయిందో చెప్పక్కర్లేదు. ఆమెను కేవలం గ్లామర్ కోణంలోనే స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయడంపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా ఈ పాత్రపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో, దర్శకుడు బుచ్చిబాబు సైతం స్పందించి బహిరంగంగా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. అయితే ఈ వివాదం ఇంతటితో ఆగకుండా బాలీవుడ్ కీ తాకింది.ముఖ్యంగా సీనియర్ నటి, పార్లమెంట్ సభ్యురాలు జయా బచ్చన్ ఈ విషయంపై అత్యంత ఘాటుగా స్పందించారు.
also read :హోటల్ రూమ్ ఖాళీ చేస్తూ విరుష్క ఏం వదిలి వెళ్లారంటే? బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్!
సినిమాల్లో ఆడవారిని కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం చేయడాన్ని జయా బచ్చన్ తీవ్రంగా తప్పుపట్టారు. షూటింగ్ పూర్తియి, సినిమా థియేటర్లలోకి వచ్చి వివాదం రేగిన తర్వాత మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా అభ్యంతరకరమైన సీన్ గానీ, దుస్తులు గానీ ఉన్నప్పుడు నటీమణులు సెట్లోనే వాటిని వెంటనే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ఆమె తన సుదీర్ఘ సినీ కెరీర్లో ఎదురైన ఒక ఆసక్తికరమైన, చేదు అనుభవాన్ని పంచుకున్నారు. 1972 అక్టోబర్ 2న విడుదలైన క్లాసిక్ మూవీ ‘షోర్’ షూటింగ్ సమయంలో దర్శకుడు మనోజ్ కుమార్ ఒక ప్రత్యేక సన్నివేశం కోసం తనను గాగ్రా చోళీ ధరించాలని కోరారని జయ గుర్తుచేసుకున్నారు. ఆ డ్రెస్ వేసుకోవడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా, దానికి తోడుగా కచ్చితంగా చున్నీ ఉండాలని తాను పట్టుబట్టానని, కానీ దర్శకుడు అందుకు నిరాకరించడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవే జరిగిందని ఆమె వివరించారు.
also read :షాకింగ్ ట్విస్ట్.. జయం రవికి కోర్టులో చుక్కెదురు.. ఆర్తి వేసిన భరణం కేసులో మైండ్ బ్లాంక్ అయ్యే సీన్!
తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఏ రోజూ పని చేయలేదని, ఆ గొడవ తర్వాత సెట్లో ఎవరూ కూడా తనతో గీత దాటి ప్రవర్తించే ధైర్యం చేయలేదని చెప్పారు. తన కెరీర్లో అలాంటి చేదు అనుభవం అదొక్కటేనని, ఆ తర్వాత మళ్ళీ తాను ఆ దర్శకుడితో ఎప్పుడూ సినిమా చేయలేదని జయా బచ్చన్ తేల్చిచెప్పారు.
జయా బచ్చన్ చేసిన ఈ వ్యాఖ్యలకు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పూర్తి మద్దతు ప్రకటించారు. వెండితెరపై రొమాన్స్ పండించాలన్నా, ప్రేక్షకులను మెప్పించాలన్నా ఒంటిపై బట్టలు తగ్గించాల్సిన అవసరం లేదని కరీనా అభిప్రాయపడ్డారు. గతాన్ని పరిశీలిస్తే కాజోల్, శ్రీదేవి, షర్మిలా ఠాగూర్ వంటి లెజెండరీ స్టార్స్ సాంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి కూడా కేవలం తమ అద్భుతమైన హావభావాలు, నటనతోనే కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని కరీనా గుర్తుచేశారు. గ్లామర్ అనేది వేసుకునే దుస్తుల్లో ఉండదని, నటి ప్రదర్శించే నటనలో, కళ్ళల్లో ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, మైత్రీ మూవీ మేకర్స్ సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం మరో విశేషం. జాన్వీ కపూర్ ఈ సినిమాతో తెలుగులో మరో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడినప్పటికీ, వివాదం ఆమె పాత్ర చుట్టూనే తిరగడం గమనార్హం.
గతంలో 2024 సెప్టెంబర్లో విడుదలైన ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ, అక్కడ కూడా ‘తంగం’ అనే పల్లెటూరి పడుచు పాత్రలో గ్లామర్ పరంగానే హైలైట్ అయ్యారు. ఇప్పుడు ‘పెద్ది’లో కూడా ఆమెను అచ్చియమ్మగా కేవలం కమర్షియల్ హంగుల కోసమే వాడుకున్నారనే విమర్శలు రావడం గమనార్హం. ఏదేమైనా ఈ ‘పెద్ది’ వివాదం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో మహిళల పాత్రల ప్రాధాన్యతపై, ఆత్మగౌరవంపై ఒక కొత్త చర్చకు దారితీసిందనే చెప్పాలి.
also read :జాన్వీ సీన్ల కటింగ్స్ తర్వాత ‘పెద్ది’లో మేజర్ చేంజెస్..ఆ సీన్లు యాడ్ చేస్తున్న మేకర్స్!