Virushka Gesture : విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే అభిమానుల్లో పూనకం వచ్చేస్తుంది. ఒకరు మైదానంలో పరుగుల వరద పారిస్తూ రికార్డులని కొల్లగొడుతుంటే , మరొకరు సిల్వర్ స్క్రీన్ పై తన నటనతో కోట్లాది మంది ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు.ఇక 2017 డిసెంబర్ 11న ఇటలీలోని టస్కనీలో అత్యంత వైభవంగా జరిగిన వీరి వివాహం అయితే అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్.
అప్పటినుంచి ఇప్పటివరకు ఈ ‘విరుష్క’ జంట ఎక్కడ కనిపించినా, ఏం చేసినా అది సంచలనమే. తాజాగా ఈ లవ్లీ కపుల్ అహ్మదాబాద్లో చేసిన ఒక అద్భుతమైన పని ఇప్పుడు నెట్టింటిని షేక్ చేస్తోంది. సెలబ్రిటీలు అంటే కేవలం గ్లామర్, లగ్జరీ మాత్రమే కాదు, వారిలో ఎంతటి మానవత్వం, వినయం ఉంటాయో మరోసారి నిరూపించారు.
మాములుగా స్టార్ క్రికెటర్లు, సినిమా నటులు హోటళ్లలో బస చేసినప్పుడు అక్కడి సిబ్బంది వారితో ఫోటోలు దిగడానికో, ఆటోగ్రాఫ్ ల కోసమో ఎగబడుతుంటారు. కానీ విరాట్, అనుష్క మాత్రం తమకు సేవలందించిన ఒక సాధారణ హోటల్ స్టాఫ్ మెంబర్ పట్ల చూపించిన ఆదరణ అందరినీ ఫిదా చేస్తోంది. అహ్మదాబాద్లోని ఒక లగ్జరీ హోటల్లో బస చేసిన ఈ జంట, తమ గదిని చూసుకుంటూ, తమకు ఎలాంటి లోటు రాకుండా ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షించిన ఆశి అనే మహిళా సిబ్బందికి ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. ఆమె అందించిన అసాధారణమైన సేవలని మెచ్చిన విరుష్క జంట, వెళ్లేటప్పుడు ఒక పర్సనలైజ్డ్ హ్యాండ్ రిటన్ నోట్ (చేతితో రాసిన లేఖ)ను ఆమె కోసం వదిలి వెళ్లారు.
ఆ లేఖలో తమకు హోటల్ బసను ఎంతగానో గుర్తుండిపోయేలా చేసినందుకు, తమ పట్ల చూపించిన శ్రద్ధకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఒక స్టార్ హోటల్ సిబ్బందికి దేశంలోనే అత్యంత పాపులర్ సెలబ్రిటీ జంట నుండి ఇలాంటి ప్రశంస దక్కడం అంటే మామూలు విషయం కాదు. ఈ విషయాన్ని ఆ సిబ్బంది సోషల్ మీడియాలో పంచుకోవడంతో, అది కాస్తా క్షణాల్లో వైరల్గా మారింది. కోట్లాది మంది అభిమానులు విరాట్, అనుష్కల డౌన్-టు-ఎర్త్ అంటూ కొనియాడుతున్నారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి ఈ జంటే నిదర్శనమంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు.
also read :38 ఏళ్లకే గుండెపోటుతో పాపులర్ సింగర్ మృతి.. షాక్లో సోషల్ మీడియా!
నిజానికి అనుష్క శర్మ సినిమాల్లో కూడా ఇలాంటి ఎమోషనల్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించారు. 2008లో షారూఖ్ ఖాన్ సరసన ‘రబ్ నే బనా దీ జోడీ’ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్క, ఆ తర్వాత ‘బ్యాండ్ బాజా బారాత్’, ‘పికె’, ‘సుల్తాన్’ వంటి ఎన్నో బ్లాక్బస్టర్ హిట్లలో నటించారు. ముఖ్యంగా 2018లో వచ్చిన ‘సూయి ధాగా’ సినిమాలో ఒక సాధారణ మధ్యతరగతి మహిళగా, కష్టపడే మనస్తత్వం ఉన్న పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. రీల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లోనూ కష్టపడే వారిని గౌరవించడం ఆమెకు అలవాటని ఈ ఘటనతో మరోసారి రుజువైంది. మరోవైపు విరాట్ కోహ్లీ మైదానంలో ఎంత అగ్రెసివ్గా ఉంటారో, మైదానం వెలుపల అంతటి దయా హృదయం ఉంటుందన్న సంగతి తెల్సిందే.
ఏది ఏమైనా ఒక చిన్న థాంక్యూ నోట్ ఒకరి ముఖంలో ఎంతటి చిరునవ్వును నింపుతుందో, సమాజానికి ఎలాంటి మంచి సందేశాన్ని ఇస్తుందో విరుష్క జంట ప్రాక్టికల్గా చూపించింది. అందుకే ఈ వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారిపోయింది.
also read :సాక్షి శివానంద్కు ఏమైంది? సినిమాలు వదిలి ఎందుకు పారిపోయింది? ఆ నిర్మాతే కారణమా?