Pooja Hegde Controversy: బుట్ట బొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకున్న హీరోయిన్ పూజా హెగ్డే. కొద్ది సంవత్సరాలుగా ఈ హీరోయిన్ కి ఒక్క విజయం కూడా లేకపోయినా.. ఈమెకు ఇండస్ట్రీలో పాపులారిటీ అయితే తగ్గలేదు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ రోజు ఉదయం నుంచి పూజ హెగ్డే గురించి.. ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. “ఒక స్టార్ హీరో నా అనుమతి లేకుండా నా క్యారీవాన్లోకి వచ్చాడు. నేను అతనికి చెంపదెబ్బ కొట్టాను. ఆ రోజు నుంచి అతను నాతో పని చేయడం లేదు” అని పూజ హెగ్డే చెప్పిందని కొన్ని పోస్టులు ప్రచారం చేశాయి. ఈ వార్త చూసిన అభిమానులు వెంటనే అనేక ఊహాగానాలు మొదలుపెట్టారు. కొందరు నటుల పేర్లు కూడా ఈ వార్తకు జత చేసి షేర్ చేయడం ప్రారంభించారు.
ఈ ప్రచారం వల్ల సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. “ఆ హీరో ఎవరు?”, “ఎప్పుడు జరిగింది?” అంటూ అనేక ప్రశ్నలు వచ్చాయి. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్, ఫ్యాన్ పేజీలు ఈ వార్తను నిజమే అన్నట్లు చూపించాయి. అయితే.. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదు. పూజా హెగ్డే అలాంటి వ్యాఖ్యలు ఎక్కడా చేయలేదని పూజా హెగ్డే తెలిపింది. ఆమె ఇచ్చిన ఏ ఇంటర్వ్యూలోనూ ఇలాంటి మాటలు లేవని స్పష్టం చేసింది.
“పూజా హెగ్డే ఎవరినీ ఉద్దేశించి ఇలాంటి మాటలు చెప్పలేదు. ఈ కథ మొత్తం ఊహాజనితమే. సోషల్ మీడియాలో ఎవరో సృష్టించిన అబద్ధపు వార్త ఇది” అని తెలిపారు. ఈ వార్త పూర్తిగా అసత్యమని.. ఆధారాలు లేనివని వారు స్పష్టం చేశారు.
పూజా హెగ్డే ప్రస్తుతం తన సినిమాలపై దృష్టి పెట్టిందని.. పనిలో బిజీగా ఉందని సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఆమె ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని.. అభిమానులు ఇలాంటి వార్తలను నమ్మకుండా..అధికారిక సమాచారం వచ్చినప్పుడు మాత్రమే స్పందించాలని సూచించారు.
ఈ హీరోయిన్ సినిమాల విషయానికి వస్తే.. పూజ.. హీరో విజయ్ తో నటించిన జన నాయగన్ సినిమా గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తోంది. సెన్సార్ ఇబ్బందుల వల్ల ఈ చిత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. కానీ ఇది విజయ్ చివరి సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి ఎన్నో ఫ్లాపులతో సతమతమవుతున్న పూజకి ఈ సినిమా అయినా విజయ మందిస్తుందో చూడాలి.