Cyberabad Crime: వారం రోజులపాటు జరిపిన స్పెషల్ ఆపరేషన్ లో తొమ్మిది సైబర్ నేరాల్లో పన్నెండు మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు సైబరాబాద్ సైబర్ క్రైం డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. వేర్వేరు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నట్టు చెప్పారు. ట్రేడింగ్ మోసాలకు సంబంధించిన కేసుల్లో ఏడుగురిని కటకటాల వెనక్కి పంపించినట్టు తెలియచేశారు. ఆ తరువాత జాబ్ ఫ్రాడ్, పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్ కేసుల్లోని నిందితులు ఉన్నారన్నారు. ఇక, 58 సైబర్ క్రైం కేసుల్లో ఆయా కోర్టుల నుంచి 406 రీఫండ్ ఆర్డర్లను సాధించినట్టు చెప్పారు. ఈ కేసుల్లోని బాధితులకు త్వరలోనే 1.41 కోట్ల రూపాయలను అందించనున్నట్టు తెలిపారు.
ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తామని ఓ యువకున్ని నమ్మించిన సైబర్ కేటుగాళ్లు దరఖాస్తు, ఇంటర్వ్యూ, ప్రాసెసింగ్ ఛార్జీల పేర 22.80లక్షలకు టోకరా వేసినట్టు చెప్పారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి అయిన పురుషోత్తం శర్మతోపాటు అతనికి సిమ్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన ఢిల్లీ వాస్తవ్యులు కుల్ దీప్ కుమార్, సునీల్ లను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. ఉద్యోగాలు, పెట్టుబడుల పేర సోషల్ మీడియా, జాబ్ పోర్టల్స్ ద్వారా వచ్చే ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగ దరఖాస్తులు, ఇంటర్వ్యూలు, అపాయింట్మెంట్ల కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బు చెల్లించవద్దన్నారు.
నిజానికి కంపెనీలు ముందస్తుగా ఎలాంటి డబ్బు వసూలు చేయవన్నారు. వ్యక్తిగత వివరాలు, చెల్లింపులు చేసే ముందు అధికారిక వెబ్సైట్లు లేదా సంబంధిత హెచ్ఆర్ విభాగాల నిజమైన కంపెనీలా? కాదా? అన్నది నిర్ధారించుకోవాలన్నారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలన్నారు. దాంతోపాటు www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని చెప్పారు.
Also Read: Rajiv Swagruha: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్లకు ఫుల్ డిమాండ్.. మరోసారి అధిక ధర పలికిన భూములు..?