Regina Cassandra: దక్షిణాది సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి రెజీనా కాసాండ్రా. తాజాగా హిందీ చిత్ర పరిశ్రమలో (బాలీవుడ్) తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, బాలీవుడ్లో తనను తక్కువ చేసి చూశారని, అది కేవలం మాటలకే పరిమితం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రెజీనా 2019లో వచ్చిన ‘ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా’ సినిమాతో బాలీవుడ్ అరంగేట్రం చేశారు. సాధారణంగా దక్షిణాది నటీనటులకు హిందీ రాదనే ఒక ముద్ర ఉంటుంది. కానీ, రెజీనా విషయంలో అది తప్పు. ఆమెకు హిందీ రాయడం, చదవడం అనర్గళంగా మాట్లాడటం వచ్చు. “చాలా మంది దక్షిణాది నటీనటుల కంటే నా హిందీ చాలా బాగుంటుంది. నేను చేసిన ప్రతి హిందీ ప్రాజెక్టుకు నా సొంత గొంతుతోనే డబ్బింగ్ చెప్పుకున్నాను, ఎక్కడా వేరే వాళ్లతో చెప్పించలేదు” అని ఆమె గర్వంగా చెప్పారు. అయినప్పటికీ, పరిశ్రమలో ఆమె పట్ల ఒక రకమైన ‘చూపుడు వివక్ష’ కొనసాగిందని ఆమె పేర్కొన్నారు.
రెజీనా అభిప్రాయం ప్రకారం, బాలీవుడ్లో కొందరు వ్యక్తులు ఆమెను చాలా అగౌరవంగా చూశారు. “నన్ను తక్కువ చేసి చూస్తున్నారని ఎవరైనా సులభంగా గమనించవచ్చు. అది కేవలం మాటల్లోనే కాదు, వారి ప్రవర్తన, చేతల్లో కూడా కనిపించింది. నేను ఆ వివక్షను స్పష్టంగా అనుభవించాను,” అని ఆమె తెలిపారు. ఒక నటిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, కేవలం ‘సౌత్ ఇండియన్’ అనే ముద్రతో తనను తక్కువగా చూడటం తనను బాధించిందని ఆమె వెల్లడించారు.
Read also-Mega 158: బాబీ దర్శకత్వంలో రాబోతున్న మెగాస్టార్ సినిమా క్యాన్సిల్!.. ఏం జరిగిందంటే?
ముంబైలో స్థిరపడటానికి, అక్కడ పని సంస్కృతికి అలవాటు పడటానికి తనకు కొంత సమయం పట్టిందని రెజీనా చెప్పారు. ఉత్తరాదిలో పనిచేసేటప్పుడు తనకు కొన్ని అభ్యంతరాలు (inhibitions) ఉండేవని, అక్కడ తనను ఒక పరాయి వ్యక్తిగా చూస్తున్నారనే భావన కలిగిందని ఆమె అన్నారు. అయితే, పరిశ్రమలో ప్రతి ఒక్కరూ అలాగే ఉంటారని తాను అనడం లేదని, కానీ అగౌరవానికి గురైన సందర్భాలు మాత్రం వాస్తవమని ఆమె స్పష్టం చేశారు. దక్షిణాది నటీనటులు బాలీవుడ్లో రాణిస్తున్న ఈ రోజుల్లో కూడా, రెజీనా వంటి ప్రతిభావంతులైన నటీమణులు ఇలాంటి వివక్షను ఎదుర్కోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రతిభకు భాషా భేదాలు ఉండకూడదని, నటీనటుల మూలాలను బట్టి వారిని తక్కువ చేసి చూడటం సరికాదని ఆమె వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.