Sad Endings in Telugu Love Storie: ప్రేమంటే ప్రాణాలు ఇవ్వడం కాదు, ప్రాణంగా చూసుకోవడం అనే ప్రాక్టికల్ లైఫ్లో ఉన్న నేటి జనరేషన్కు, ఇంకా పాతకాలపు చావుల సెంటిమెంట్ను రుద్దాలని చూస్తే థియేటర్లు ఖాళీ అవ్వడం ఖాయం. ఒకప్పుడు ‘గీతాంజలి’, ‘ప్రేమ’, ‘మరో చరిత్ర’ లాంటి సినిమాలు చూసి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఆ ఎమోషన్కు ఒక జస్టిఫికేషన్ ఉండేది. కానీ, ఈ కాలంలో కూడా అదే ‘చావు’ ఫార్ములాను నమ్ముకుంటే కుదరదు.
అసలీ టాపిక్ ఇప్పుడెందుకు అంటారా ..త్వరలో థియేటర్లని పలకరించే ఈ రెండు సినిమాకు చివర్లో సాడ్ ఎండింగ్స్ ఉండబోతున్నాయట. అవును ..కిరణ్ అబ్బవరం హీరోగా రవి నంబూరి దర్శకత్వంలో వస్తున్న చెన్నై లవ్ స్టోరీ సినిమా లో హీరో సినిమా సగం అయ్యే సరికే చనిపోతాడన్న టాక్ వినిపిస్తుంది.అది కూడా తనెంతో ఇష్టంగా ప్రేమించే అమ్మాయి కోసం.కేవలం ఇంప్రెస్ చేయడం కోసమో, లేక ప్రేమను నిరూపించుకోవడం కోసమో ఇంటర్వెల్కే హీరోను చంపేయడం, ఆపై క్లైమాక్స్లో హీరోయిన్ కూడా చనిపోవడం లాంటి లైన్లు వినడానికే విచిత్రంగా ఉన్నాయి అంటుంది ఇప్పుడున్న జెన్ జీ యూత్ .నిజానికి అప్పట్లో ఇలాంటి సాడ్ ఎండింగ్స్ తో వచ్చిన సినిమాలు ఆడియన్స్ చేత చప్పట్లు కొట్టించుకుని ఆ తర్వాత కల్ట్ క్లాసిక్స్ గా నిలబడ్డాయేమో కాని ఇపుడు ఇలా విషాదాంత సినిమాలు ఇపుడు ఆడతాయా అంటే అనుమానమే.
ఇక రోషన్ హీరోగా వస్తున్న మరో సినిమా ‘తెల్లకాగితం. వదిలిన పాటలు ,రిలీజ్ చేసిన పోస్టర్స్ చూస్తుంటే సినిమా సాలిడ్ గా యూత్ ని కనెక్ట్ చేసేలానే కనిపించింది.కాని లేటెస్ట్ గా ఇందులో ఏకంగా హీరో హీరోయిన్ ఇద్దరు చివర్లో చనిపోతారని ఫిలిమ్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.ఇద్దరు ప్రేమికులను చంపేసి, థియేటర్ నుండి బయటకు వచ్చే ప్రేక్షకుడి గుండెను బరువెక్కించడం వల్ల సాధించేదేంటో మేకర్స్కే తెలియాలి.అసలు హీరో హీరోయిన్లు ఇద్దరూ చనిపోతే ఆ సినిమాను ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? గతంలో ‘ఆర్ఎక్స్ 100’ లో చావు ఉంటుంది, కానీ అక్కడ ఒక పగ, ద్రోహం అనే బలమైన పాయింట్ ఉంది. ‘ఉప్పెన’ లో ముగింపు భారంగా ఉన్నా, ప్రాణాలు తీయలేదు. కానీ, అంతే కానీ, ‘తెల్లకాగితం’ లాగా చేతిలో ఏమీ లేకుండా, కేవలం గుండెలు బాదుకునే సెంటిమెంట్తో వస్తే మాత్రం ఫలితం దారుణంగా ఉంటుంది.సినిమా అంటే రెండు గంటల వినోదం, లేదా ఒక మంచి అనుభూతిని ఆశించి వెళ్లే సగటు ఆడియన్స్కు, ఇలాంటి క్లైమాక్స్లు తీవ్ర అసహనాన్ని మిగులుస్తాయనడంలో ఆశ్చర్యం లేదు.
also read:రీల్స్ పిచ్చి పీక్స్కి చేరింది.. అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు స్టంట్స్..నెటిజన్లు ఫైర్!
టాలీవుడ్లోనే కాదు, కోలీవుడ్లో కూడా ‘సేతు’ (తెలుగులో శేషు), ‘7G బృందావన్ కాలనీ’ లాంటి సినిమాలు ట్రాజిక్ ఎండింగ్స్తో క్లాసిక్స్ అయ్యాయి. కానీ, ఆ సినిమాల్లోని కంటెంట్ వేరు. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడకం పెరిగాక, ప్రేక్షకులు ప్రతి చిన్న లాజిక్ను వెతుకుతున్నారు. రీసెంట్గా వచ్చిన కొన్ని లవ్ స్టోరీస్ బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలం కావడానికి ప్రధాన కారణం ఈ ‘సాడ్ ఎండింగ్’ పిచ్చే. జనాలు జీవితంలోనే బోలెడంత స్ట్రెస్ ఫీల్ అవుతుంటే, థియేటర్లలోకి వచ్చి కూడా అదే ఏడుపులు, చావులు చూడాలంటే ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారు.
‘చెన్నై లవ్ స్టోరీ’ తెల్లకాగితం లాంటి సినిమాలు ఈ విషయాన్ని ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. విభిన్నమైన ముగింపు ఇవ్వాలనే తాపత్రయంలో లాజిక్ లేని చావులను చూపిస్తే, నెటిజన్లు మీమ్స్తో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేయడం ఖాయం. రొటీన్ కమర్షియల్ ఎండ్స్ వద్దు అనుకుంటే ప్యాచప్ చేయండి, అంతే కానీ ఇద్దరినీ చంపేసి ‘ఇదొక అమరప్రేమ కథ’ అని బోర్డులు తగిలిస్తే ఈ తరం యూత్ అస్సలు ఒప్పుకోరన్నది నిజం.