Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో భరోసాని కల్పిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల రైతులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. దోర్నాల మండలం గంటావానిపల్లిలో జరిగిన ఈ భేటిలో సీఎం మాట్లాడుతూ.. అభివృద్ధి జరగాలంటే కొంత మంది భూములు కోల్పోకతప్పదని అన్నారు. నాలుగు జిల్లాల తలరాతలు మార్చే ప్రాజెక్టు వెలిగొండ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతవాసులు.. నీళ్ళు లేక చాలా మంది ఫ్లోరైడ్ వాటర్ తాగుతున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా నదీ జలాలు ఈప్రాంతానికి వస్తాయని ఎవరూ ఆలోచన చేసి ఉండరని చంద్రబాబు అన్నారు. రాయలసీమ, మార్కాపురం ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకురావాలని ఎన్టీఆర్ ఆలోచన గుర్తుచేశారు. 1996 మార్చి 26న వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించామని చెప్పారు. రూ.900 కోట్లు పునరావాసం కోసం కేటాయించినట్లు తెలిపారు. రూ.300 కోట్లు మొదటి విడతలో నిర్వాసితులకు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. వెలిగొండ నిర్వాసితులైన 3,351 కుటుంబాల ఖాతాల్లో ఈ రూ.300 కోట్లు జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.
వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల త్యాగం వృథా కాదని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు అన్నారు. అందరికంటే మెరుగైన జీవితం కల్పిస్తామని వారికి భరోసా ఇచ్చారు. వెలిగొండ ప్రాజెక్టుపై ఈ టర్మ్లో రూ.3,900 కోట్ల వ్యయం చేయనున్నట్లు తెలిపారు. 2027 నాటికి మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఫేజ్-1, ఫేజ్-2 పనులు వేగంగా కొనసాగుతున్నాయని.. ఇడుపూరు, గోగులదిన్నే, తోకపల్లి తదితర పునరావాస కాలనీల్లో మౌలిక వసతులు పూర్తి చేసినట్లు చంద్రబాబు చెప్పారు. అటు మార్కాపురానికి ప్రత్యేక జిల్లా ఇచ్చామన్న చంద్రబాబు.. కలెక్టరేట్ కూడా పునరావాస కాలనీ పక్కనే వస్తుందన్నారు.
Also Read: అమరావతిలో హైటెన్షన్.. వైసీపీ నేతల పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లు, కోడిగుడ్లతో దాడి!
నిర్వాసితుల పునరావాస కాలనీ.. భవిష్యత్తులో ఆదర్శ టౌన్షిప్గా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు.. 23 లక్షల మందికి తాగునీరు అందేలా వెలిగొండ ప్రాజెక్టు ఉంటుందని పేర్కొన్నారు. 43.5 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. సుంకేసుల, గొట్టిపడియ డ్యామ్లకు రూ.120 కోట్ల పరిపాలనా అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యమైందన్న చంద్రబాబు.. పదేళ్ల ముందే ప్రాజెక్టు పూర్తయి ఉంటే రైతుల జీవితాలు మారిపోయేవన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.
Also Read: హైదరాబాద్లో రోడ్డుకు ట్రంప్ పేరు.. స్పందించిన అమెరికా అధ్యక్షుడు.. ఏమన్నారంటే?