Ampere Electric Crosses 4 Lakh Sales Milestone: భారత ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్ లో ఆంపియర్ ఎలక్ట్రిక్ మరో అరుదైన ఘనత సాధించింది. కంపెనీ తాజాగా దేశవ్యాప్తంగా 4 లక్షల యూనిట్ల అమ్మకాల మైలురాయిని దాటేసింది. ఎలక్ట్రిక్ స్కూటర్లకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఆంపియర్ ఈ రికార్డు నెలకొల్పింది.
ఆంపియర్ ఎలక్ట్రిక్ కుటుంబాల కోసం రూపొందించిన ఎలక్ట్రిక్ స్కూటర్లతో పాటు, లాస్ట్ మైల్ డెలివరీ సేవలు అందించే ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన తక్కువ వేగం గల వాహనాలను కూడా విక్రయిస్తోంది. ఈ రెండు విభాగాల్లోనూ కంపెనీ సత్తా చాటుతోంది. ఇటీవలే ఆంపియర్ తన ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో 3 లక్షల యూనిట్ల మార్క్ ను దాటినట్లు ప్రకటించింది. ఇప్పుడు మొత్తం అమ్మకాలు 4 లక్షల యూనిట్లను దాటడం కంపెనీ వేగంగా ఎదుగుతుందని చెప్పేందుకు నిదర్శనం. అయితే ఈ 4 లక్షల అమ్మకాల గణాంకాల్లో వాహన్ పోర్టల్ లో నమోదు కాని కొన్ని తక్కువ వేగం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ, కంపెనీ మార్కెట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
2025 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, 2026లో ఆంపియర్ మంచి అమ్మకాలు సాధించింది. కంపెనీ సంవత్సరానికి సుమారు 51 శాతం వృద్ధిని సాధించినట్లు తెలిపింది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్లో కంపెనీ వాటా కూడా పెరిగింది. FY25లో ఆంపియర్ మార్కెట్ షేర్ 3.6 శాతంగా ఉండగా, FY26లో 4.4 శాతానికి చేరుకుంది. ఇది భారత్ లో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో కంపెనీ స్థానం మరింత బలపడినట్లు వెల్లడిస్తోంది. ప్రస్తుతం భారత ఈవీ మార్కెట్లో టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, ఓలా ఎలక్ట్రిక్, అథర్ ఎనర్జీ, విడా ఎలక్ట్రిక్ లాంటి సంస్థలు ముందంజలో ఉన్నాయి. వీటి తర్వాత ఆంపియర్ దేశంలో ఆరో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ గా నిలిచింది.
మార్కెట్లో తన మరింత సత్తా చాటేందుకు ఆంపియర్ పలు చర్యలు తీసుకుంటోంది. FY25తో పోలిస్తే కంపెనీ తన డీలర్ నెట్ వర్క్ ను 12 శాతం విస్తరించినట్లు వెల్లడించింది. అంతేకాకుండా, ఇప్పటికే ఉన్న షోరూమ్ లను ఆధునీకరించి వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. కస్టమర్ ఎక్స్ పీరియెన్స్ ను మెరుగుపరచడంపై కంపెనీ ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఆంపియర్ ప్రస్తుతం భారత మార్కెట్లో మూడు ప్రధాన ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణులను విక్రయిస్తోంది. వాటిలో నెక్సస్, మాగ్నస్, రియో మోడళ్లు ఉన్నాయి. నెక్సస్ శ్రేణిలో EX, ST వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మాగ్నస్ సిరీస్లో నియో, గ్రాండ్, జి మాక్స్ మోడళ్లు ఉన్నాయి. ఇక రియో శ్రేణిలో 80, VYB మోడళ్లు విక్రయిస్తున్నారు. ఇందులో రియో సిరీస్ తక్కువ వేగంతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాల కేటగిరీలోకి వస్తుంది. భారత నిబంధనల ప్రకారం ఇవి లో స్పీడ్ ఎలక్ట్రిక్ వాహనాలుగా గుర్తింపు పొందాయి.
Read Also: భారత ఈవీ మార్కెట్లో ఏథర్ దూకుడు.. 7 లక్షల సేల్ మార్క్ క్రాస్!