Shah Rukh: షారుఖ్ ఖాన్ ….కింగ్ ఆఫ్ బాలీవుడ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.. సాధారణంగా ఒక సినిమా హిట్ అయ్యాక దాని చుట్టూ క్రేజ్ రావడం కామన్. కానీ, ఏ గ్యారెంటీ లేని సమయంలో ఒక రీజినల్ సినిమాను గుండెల్లో పెట్టుకుని సపోర్ట్ చేయడం ఒక్క కింగ్ ఖాన్కే సాధ్యమైంది. ప్రస్తుతం మరాఠీ చిత్రసీమలో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ, బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్న సినిమా ‘దేవుళ్ బంద్2 ‘ (Deool Band 2). కేవలం 8 నుంచి 10 కోట్ల రూపాయల తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటికే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 81.78 కోట్ల రూపాయల వసూళ్లతో 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 5 మరాఠీ సినిమాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా థియేటర్లలోకి రావడానికి వెనుక ఒక ఎమోషనల్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీ దాగుందన్న సంగతి మీకు తెలుసా.
విషయంలోకి వెళ్తే టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ తార్డే దర్శకత్వంలో, స్నేహల్ తార్డే ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 2015 లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘దేవుళ్ బంద్’ కు సీక్వెల్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సమాజంలో ఎంతో సున్నితమైన రైతుల ఆత్మహత్యల నేపథ్యంతో పాటు, దేవుడిపై నమ్మకం-నాస్తికత్వం మధ్య ఉండే సంఘర్షణను చూపిస్తూ, స్వామి సమర్థ్ పాత్రలో సీనియర్ నటుడు మోహన్ జోషి నటనతో ఈ సినిమా అందరి హృదయాలను గెలుచుకుంది. అయితే ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్కు ముందే మేకర్స్కు ఊహించని పెద్ద కష్టం వచ్చి పడింది. సినిమాను థియేటర్లలో ప్రదర్శించడానికి అత్యంత ముఖ్యమైన డిజిటల్ సినిమా ప్యాకేజ్ (DCP) ఫార్మాట్ కోసం చిత్ర యూనిట్ షారుఖ్ ఖాన్కు చెందిన ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’ను సంప్రదించింది.
నిజానికి ఈ ప్రాసెస్ కోసం నిర్మాతలు సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. కానీ టెక్నికల్ వర్క్ అంతా పూర్తయ్యాక చేతికి వచ్చిన బిల్లు చూసి మేకర్స్ షాకయ్యారు. దాదాపు 42 నుంచి 45 లక్షల రూపాయల వరకు బిల్లు వేసింది రెడ్ చిల్లీస్ టీమ్. అయితే సినిమా బడ్జెట్ తక్కువ కావడం వల్ల అంత పెద్ద మొత్తాన్ని అప్పటికప్పుడు అరేంజ్ చేయడం ప్రవీణ్ తార్డే బృందానికి సాధ్యం కాలేదు. డీసీపీ రెడీగా ఉన్నా, పేమెంట్ క్లియర్ కాకపోవడంతో డెలివరీ ఆగిపోయింది. దాంతో సినిమా అనుకున్న సమయానికి విడుదలవుతుందా లేదా అనే టెన్షన్ మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ప్రవీణ్ తార్డే నేరుగా రెడ్ చిల్లీస్ మేనేజ్మెంట్ను కలిసి, తాము తీసిన మరాఠీ సినిమా గురించి, తమ ఆర్థిక ఇబ్బందుల గురించి వివరించారు.
also read :బిగ్బాస్ హౌస్లోకి సామాన్యుల ఎంట్రీ.. ‘అగ్నిపరీక్ష 2’ లో అప్లై చేయడానికి రూల్స్ ఇవే!
ఈ విషయం కాస్తా కింగ్ ఖాన్ షారుఖ్ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే తన టెక్నికల్ టీమ్ను పిలిపించి వివరాలు అడిగారు. ఈ సినిమాను గతంలో సల్మాన్ ఖాన్ నటించిన ‘అంతిమ్’ సినిమాకు మూలకథ అయిన ‘ముల్షీ ప్యాటర్న్’ డైరెక్టర్ ప్రవీణ్ తార్డే రూపొందించారని టెక్నికల్ టీమ్ చెప్పడంతో షారుఖ్కు ఒక ఐడియా వచ్చింది. సినిమా కంటెంట్ చాలా ఎమోషనల్గా బాగుందని, కానీ బడ్జెట్ ఇబ్బందుల వల్ల డీసీపీ బిల్లు కట్టలేకపోతున్నారని తెలుసుకున్న షారుఖ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ‘అది మన ప్రాంతీయ సినిమా, వెంటనే ఆ 42 లక్షల బిల్లును పూర్తిగా మాఫీ చేయండి. డబ్బుల గురించి తర్వాత చూసుకోవచ్చు, సినిమా మంచిదైనప్పుడు వారికి డీసీపీ ఇచ్చేయండి’ అంటూ తన మంచి మనసుని మరోసారి చాటుకున్నాడు షారుఖ్.
షారుఖ్ చేసిన ఈ ఊహించని సాయం వల్లే ‘దేవుళ్ బంద్ 2’ సినిమా సకాలంలో థియేటర్లలోకి వచ్చి, ఈరోజు 80 కోట్లకు పైగా వసూళ్లతో ఇండస్ట్రీ హిట్ వైపు దూసుకెళ్తోంది. ఒక సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియకముందే, కేవలం కంటెంట్ను నమ్మి, మరాఠీ సినిమాపై గౌరవంతో షారుఖ్ ఖాన్ చేసిన ఈ సాయాన్ని డైరెక్టర్ ప్రవీణ్ తార్డే రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సినిమా సక్సెస్ అయిన ఈ తరుణంలో షారుఖ్ ఖాన్కు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని, త్వరలోనే ఆయనకు ఈ సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపించాలని ఆశపడుతున్నట్లు ప్రవీణ్ తార్డే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ రియల్ స్టోరీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండటంతో, షారుఖ్ ఖాన్ కేవలం స్క్రీన్ పైనే కాదు రియల్ లైఫ్ లోనూ సూపర్ స్టారే అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.