ఇవాళ రాహుల్ గాంధీ జన్మదినం. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. కూలెస్ట్ లీడర్ అని.. జెన్- జీ మెచ్చిన నేత అని కీర్తిస్తున్నారు. శుభాకాంక్షలు రోటీన్. కూలెస్ట్ నేత అనేది కూడా ఆయన వైఖరిని గమనించే ప్రతీ ఒక్కరూ ఒప్పుకునేదే. కానీ ఇక్కడ కొత్త పదం వినిపిస్తోంది. అదే జెన్- జీ మెచ్చిన నేత అని. అంటే మోడీని ఈ జెన్-జీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పకనే చెప్పినట్టయిందన్నమాట.
కాక్రోచ్ జనతా పార్టీ జనంలోకి దూసుకెళ్లిన నాటి నుంచి ఇది కాంగ్రెస్కు అనుకూలంగా, బీజేపీకి వ్యతిరేకంగా అనే టాక్ నడుస్తోంది. ఈ ప్రచారానికి అనుగుణంగానే బీజేపీ శ్రేణులు, ఆరెసెస్ సానుభూతి పరులు.. కాక్రోచ్ జనతా పార్టీని విమర్శిస్తూ వస్తున్నారు. వెటకారాలు, వ్యంగ్యాలు, మార్ఫింగులు, అపవాదులు, బురద జల్లడాలు.. ఎన్నో చేశారు. ఇవన్నీ కూడా బీజేపీపై ఇంకా వ్యతిరేకతను మూటగట్టాయే తప్ప.. తగ్గించలేదు. ఇక ఇది జాతీయ పార్టీల్లో ప్రత్యామ్నాయంగా ఉన్న కాంగ్రెస్కు అనుకూలతను తెచ్చిపెట్టింది. జెన్-జీ బలంగా ఉందని తెలిపేందుకు కాక్రోచ్ ఎదిగిన విధానమే ఓ ఉదాహరణగా ఉంది.
అయినా అటు కేంద్రం మేల్కోలేదు. పైగా బీజేపీ సోషల్ మీడియా.. సానుభూతి పరులు కాక్రోచ్ పార్టీపై దాడికి తెగబడ్డారు. ఆఖరుకు ఏపీకి చెందిన పవన్ కళ్యాణ్ కూడా. ఇది ఓ రకంగా మోడీని సమర్థించడంలో భాగమని వారంతా అనుకుంటున్నారు. కానీ… అది మోడీని మరింతగా ప్రజలకు దూరం చేసి.. రాహుల్ గాంధీకి మద్దతు బలం పెరుగుతుందనే ఆలోచన వారికే ఏనాడూ రాలేదు.
కారణం.. అధికార దర్పం. మోడీ ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ఓ ఫీలింగ్. దేశం కోసం.. ధర్మం కోసమే మోడీ ఏం చేసినా.. అనే దానికి జనాలు కూడా బాగా కనెక్టయి ఉన్నారనే భావనలో ఉన్నారు. కానీ అది ఆదిలోనే. ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. బీఆరెస్ సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో… అంతకు వంద రెట్లు జెన్-జీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంది.
తప్పు తెలుసుకోకపోవడం ఒక లోపమైతే.. ఆ లోపాన్నే కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేయడం.. మరింత పెద్ద తప్పుగా జెన్-జీ భావిస్తోంది. అందుకే ఎప్పటికప్పుడు కేంద్రం తప్పులను, మోడీ విధానలను ఎండగడుతూ వస్తోంది. ఓ రకంగా ఇది కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకు.. లా రాహుల్కు ప్లస్ అవుతోంది.