HBD Shruti Haasan: సాధారణంగా ఎవరికైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే సక్సెస్ అందుకోవడం అంటే కత్తి మీద సాము లాంటిది. కానీ కొంతమందికి అదృష్టం దరిద్రంలా పట్టుకుంటుంది అనడంలో సందేహం లేదు. వరుస విజయాలతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ దూసుకుపోతూ ఉంటారు. అయితే మరి కొంతమంది సినీ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ సరైన సక్సెస్ లభించక ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంటూ ఉంటారు. ఇక తర్వాత తమ నటనకు తగ్గట్టుగా క్యారెక్టర్ పడితే తమను తామ ప్రూవ్ చేసుకొని స్టార్ హీరోలకు గోల్డెన్ లెగ్ గా మారిన హీరోయిన్స్ కూడా లేకపోలేదు. అలాంటి వారిలో శృతిహాసన్ (Shruti Haasan) కూడా ఒకరు. నేడు ఆమె పుట్టిన రోజు . ఈ సందర్భంగా ఐరన్ లెగ్ నుండి గోల్డెన్ లెగ్ గా ఎలా మారింది? ఈమెను ఆ రేంజ్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ ఎవరు ? అనే విషయాలపై ఆమె స్వయంగా స్పందించింది.
విశ్వ నటుడు, లోక నాయకుడిగా పేరు తెచ్చుకున్న కమలహాసన్ (Kamal Hassan) వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది శృతిహాసన్. తండ్రికి తగ్గ తనయురాలిగా ఇప్పుడు పేరు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. కెరియర్ ప్రారంభంలో కాస్త తప్పటడుగులు వేసిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది. అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచినా.. ఇందులో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తర్వాత ఓ మై ఫ్రెండ్ చిత్రంలో నటించి పర్వాలేదనిపించింది. అదే సమయంలో తమిళ్, హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులను మెప్పించింది. కానీ సరైన స్థాయిలో గుర్తింపు లభించలేదు. పైగా ఈమె నటించిన ప్రతి సినిమా కూడా డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ అనే ముద్ర వేయించుకుంది.
ఎప్పుడైతే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో గబ్బర్ సింగ్ సినిమా చేసిందో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ హోదాను దక్కించుకుంది శృతిహాసన్. తర్వాత బలుపు, రామయ్య వస్తావయ్య, ఎవడు, రేసుగుర్రం, ఆగడు, శ్రీమంతుడు, కాటమరాయుడు, క్రాక్, వకీల్ సాబ్, వీరసింహారెడ్డి , వాల్తేరు వీరయ్య, హాయ్ నాన్న, సలార్ ఇలా ఈమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయం అందుకోవడమే కాకుండా ఆ స్టార్ హీరోలు అందరికీ కూడా గోల్డెన్ లెగ్ గా మారిపోయింది. అయితే అలాంటి ఈమె గత ఏడాది రజనీకాంత్ కూలీ సినిమాలో హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సలార్ 2 లో ఈమె నటించనుంది. ఇదిలా ఉండగా సోషల్ మీడియాకు ఇటీవల గుడ్ బై చెప్పేసిన ఈ ముద్దుగుమ్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తనకు ఈ హోదాను కల్పించింది ఆయనే అంటూ చెప్పుకొచ్చింది.
ALSO READ:Border 2: బాలీవుడ్ కి భారీ ఊరట.. 5 రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లో చేరిన బార్డర్ 2!
మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించింది శృతిహాసన్. ఆమె మాట్లాడుతూ..” తెలుగులో గబ్బర్ సింగ్ సినిమా నా జీవితాన్నే మార్చింది. కోలీవుడ్ తర్వాత నాకు సక్సెస్ ఇచ్చింది కేవలం తెలుగు ఇండస్ట్రీ మాత్రమే. డైరెక్టర్ హరీష్ శంకర్ పట్టుబట్టి మరీ ఆ రోల్ ఇచ్చారు. అప్పటివరకు ఐరన్ లెగ్ అనిపించుకున్న నేను ఈ ఒక్క సినిమాతో గోల్డెన్ లెగ్ అయిపోయాను. నా తలరాతను మార్చిన డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ తెలిపింది.