Rajamouli Senthil: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్లది విడదీయలేని బంధం. ‘సై’ సినిమా నుండి ‘ఆర్ఆర్ఆర్’ వరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన విజువల్ వండర్స్ బాక్సాఫీస్ను షేక్ చేశాయి. అయితే, మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్న భారీ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘వారణాసి’ ప్రాజెక్ట్లో సెంథిల్ పని చేయడం లేదనే వార్త అభిమానులను ఆశ్చర్యపరిచింది. దీనిపై సెంథిల్ కుమార్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్పష్టతనిచ్చారు. తాజగా దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. రాజమౌళి సింధిల్ కలిసి దాదాపు తొమ్మిది సినిమాలు చేశారు.
రాజమౌళి సినిమాలకు సెంథిల్ ఎందుకు చేయడం లేదనే ప్రశ్నకు ఆయన చాలా హుందాగా సమాధానమిచ్చారు. “దర్శకుడికి తన కథకు ఏ టెక్నీషియన్ అయితే న్యాయం చేస్తారో, ఎవరి విజువల్ స్టైల్ బాగుంటుందో ఎంచుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఈ సినిమాకు వేరే సినిమాటోగ్రాఫర్ అయితే బాగుంటుందని రాజమౌళి గారు భావించి ఉండవచ్చు,” అని ఆయన పేర్కొన్నారు. ఈ మార్పు గురించి తనకు ముందే తెలుసని సెంథిల్ వెల్లడించారు. రాజమౌళి టీమ్ నుండి లైన్ ప్రొడ్యూసర్ వల్లి గారు ఫోన్ చేసి, ఈ సినిమాకు వేరే వారితో వెళ్తున్నట్లు సమాచారం అందించారని చెప్పారు. రాజమౌళితో తన జర్నీలో ఇలాంటి గ్యాప్స్ రావడం ఇదే మొదటిసారి కాదని, గతంలో కూడా కొన్ని సినిమాలకు విరామం వచ్చిందని ఆయన గుర్తు చేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాను మిస్ అవ్వడంపై స్పందిస్తూ.. “మనకు రావాల్సింది మనకే వస్తుంది. దాని గురించి బాధపడటంలో అర్థం లేదు. మహేష్ బాబు గారితో పనిచేసే అవకాశం ఇప్పుడు రాకపోయినా, భవిష్యత్తులో కచ్చితంగా వస్తుందని నమ్ముతున్నాను. సినిమా అంటేనే ఒక నిరంతర ప్రయాణం,” అని సెంథిల్ తన సానుకూల దృక్పథాన్ని చాటుకున్నారు. ఇదే ఇంటర్వ్యూలో ‘బాహుబలి’ 10 ఏళ్ళ వేడుకల గురించి కూడా ఆయన మాట్లాడారు. రాజమౌళి మరియు సెంథిల్ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, కేవలం కథా అవసరాల దృష్ట్యా మాత్రమే ఈ మార్పు జరిగిందని ఈ ఇంటర్వ్యూ ద్వారా స్పష్టమైంది. రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్ ప్రపంచ స్థాయిలో బెంచ్ మార్క్ సెట్ చేయాలని సెంథిల్ ఆకాంక్షించారు.