TGFA 2025: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దూరదృష్టి నాయకత్వంలో, తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025 (TGFA 2025) రెండో ఎడిషన్ సందర్భంగా హైదరాబాద్ నగరం కళాత్మక మహోత్సవానికి వేదికగా మారనుంది. తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని 19 మార్చి, 2026న HITEX కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ వేడుకలో భారతీయ సినీ రంగంలోని దిగ్గజాలు, రాష్ట్ర నాయకులు కలిసి తెలుగు ప్రతిభను సత్కరించనున్నారు. ఇప్పటికే అవార్డుల ఎవరెవరికి వచ్చాయనే లిస్ట్ను ప్రకటించారు. హైదరాబాద్ నడిబొడ్డున ఎంతో గ్రాండ్గా జరగనున్న ఈ వేడుకకు బాలీవుడ్ బ్యూటీస్ విశిష్ట అతిథులుగా హాజరు కాబోతున్నారు. వారెవరో కాదు.. మాధురీ దీక్షిత్ (Madhuri Dixit), ఇషా గుప్తా (Esha Gupta). సీఎం రేవంత్ రెడ్డితో కలిసి, తెలుగు సినిమా, కళలను గౌరవించేందుకు మాధురీ దీక్షిత్, ఇషా గుప్తా ఈ వేడుకలో పాల్గొనబోతున్నట్లుగా స్వయంగా వారే ప్రకటించారు.
Also Read- Nara Rohith: పొలిటికల్ ఎంట్రీపై నారా రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సినిమాల పరిస్థితేంటి?
ఈ సందర్భంగా మాధురీ దీక్షిత్ విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘ఈ ఏడాది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్లో భాగం కావడం నాకు దక్కిన నిజమైన గౌరవంగా భావిస్తున్నాను. తెలుగు సినిమాకు కథలు చెప్పడంలో, సంగీతంలో, ప్రతిభలో గొప్ప వారసత్వం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను టాలీవుడ్ అలరిస్తూనే ఉంది. మన పరిశ్రమకు ప్రాణవాయువు వంటి అట్టడుగు స్థాయి కళాకారులను, సాంకేతిక నిపుణులను గుర్తించి గౌరవించే ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ప్రాంతీయ సాంస్కృతిక స్ఫూర్తిని ప్రతిబింబించేలా సృజనాత్మకతను గౌరవించడం చాలా ముఖ్యం. తెలుగు చిత్ర పరిశ్రమలోని అసాధారణ ప్రతిభను, శక్తివంతమైన వారసత్వాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను హైదరాబాద్ రావడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని తెలిపారు.
Also Read- Naa Anvesh: వేలి ముద్రగాడివి నీకు రాజకీయాలు అవసరమా? శివాజీ పై నా అన్వేష్ ఫైర్!
ఇషా గుప్తా విడుదల చేసిన ప్రకటనలో.. ‘‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్కు హాజరుకావడం, సినిమా పరిశ్రమకు వెన్నెముకగా నిలిచే సాంకేతిక నిపుణులు, ప్రాంతీయ కళాకారులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమంలో భాగం కావడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. గద్దర్ వంటి మహనీయుని వారసత్వాన్ని స్మరించుకుంటూ, ప్రస్తుత తరం సాధించిన విజయాలను వేడుక చేసుకోవడం నిజంగా స్ఫూర్తిదాయకం. తెలంగాణ అద్భుతమైన కళాత్మక హృదయ స్పందనను కలిగి ఉంది. అన్ని రంగాలలో ప్రతిభను గుర్తించే ఈ వేడుకలో పాల్గొంటున్నందుకు నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఈ వెండితెర మాయాజాలం వెనుక ఉన్న అద్భుతమైన ప్రతిభను సెలబ్రేట్ చేసుకునే సమయం కోసం నేను వేచి చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఇక ఈ వేడుకను తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.