Ustad bhagath singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలవడానికి ఇక ఒక్క రోజే ఉంది. మెగా ఫ్యాన్స్ అంతా థియేటర్ల దగ్గర హంగామా మొదలుపెట్టేశారు. అయితే, ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ ఆడుతున్న ‘మైండ్ గేమ్’ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపొయింది.సోషల్ మీడియాలో కనిపిస్తున్న ఈ ‘ప్రేమ’ వెనుక అసలు కారణం వేరే ఉందని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది.
తెలంగాణపై స్పెషల్ ప్రేమా? మైత్రీ మార్క్ పబ్లిసిటీ
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని పెయిడ్ హ్యాండిల్స్ ఒకే విషయాన్ని తెగ ఊదరగొడుతున్నాయి. ‘మైత్రీ నిర్మాతలు ప్రేక్షకుల జేబులు చిల్లు పడకూడదని భావిస్తున్నారు.. అందుకే తెలంగాణలో రేట్లు పెంచకుండా సాధారణ ధరలకే సినిమా చూపిస్తున్నారు.. ఇది గ్రేట్ డెసిషన్’ అంటూ భజన మొదలుపెట్టారు. కానీ, నిజంగానే నిర్మాతలకు ప్రేక్షకుల మీద అంత ప్రేమ ఉంటే.. మరి ఆంధ్రప్రదేశ్లో 5 గంటల షోలకు రూ.500 ఫ్లాట్ రేట్ ఎందుకు పెట్టారు? అక్కడ ప్రేక్షకులకు జేబులు ఉండవా? లేక వాళ్లకు డబ్బులు చెట్లుకు కాస్తాయా? అన్నది ఇప్పుడు నెటిజన్ల ప్రశ్న.
అసలు విషయం ఇది: అవకాశం లేకే అడ్జస్ట్మెంట్
నిజానికి, తెలంగాణలోనూ రేట్లు పెంచుకోవాలని, స్పెషల్ షోలు వేసుకోవాలని మైత్రీ వారు గట్టిగానే ప్రయత్నించారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. గత ఏడాది కాలంగా టికెట్ రేట్ల పెంపు వ్యవహారం తెలంగాణ ప్రభుత్వానికి పెద్ద తలపోటుగా మారింది. కోర్టు కేసులు, వివాదాల వల్ల ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం కూడా జీవో తెచ్చుకోవాలని ట్రై చేశారు కానీ, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేలా కనిపించలేదు.
‘రాజాసాబ్’ దెబ్బ.. అందుకే ఈ పిల్లిమొగ్గలు
సంక్రాంతికి విడుదలైన ‘రాజాసాబ్’ విషయంలో పీపుల్స్ మీడియా భారీగా నష్టపోయిన సంగతి తెలిసిందే. రేట్ల పెంపు జీవో కోసం చివరి నిమిషం వరకు ఎదురుచూసి, బుకింగ్స్ ఓపెన్ చేయడంలో ఆలస్యం చేశారు. ఫలితంగా ఓపెనింగ్స్ మీద తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. ఇప్పుడు ‘ఉస్తాద్’ విషయంలో కూడా అదే తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్స్ దెబ్బతింటాయని భయపడ్డారు మేకర్స్.సో ప్రభుత్వం నుంచి పర్మిషన్ రాదని కన్ఫర్మ్ అవ్వడంతో ఎలాగో పెంచే ఛాన్స్ లేదు కాబట్టి, దీన్నే ఒక ‘సోషల్ కాజ్’ గా మార్చేసి “ప్రేక్షకుల కోసం రేట్లు పెంచలేదు” అని కలరింగ్ ఇస్తున్నారు.
ఏపీలో బాదుడు.. తెలంగాణలో కవరింగ్
ఏపీలో ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉండటంతో అక్కడ ఫ్యాన్స్ రక్తం పిండుతున్నారు. తెలంగాణలో మాత్రం ‘నీతులు’ చెబుతున్నారు.అవును..ఏపీలో తెల్లవారుజామున 5 గంటల షోలకి 500 వసూల్ చేస్తున్న మేకర్స్ తెలంగాణలో మాత్రం ఆ చాన్స్ లేక ఉదయం 7:30 షోలు నార్మల్ రేట్లకే మొదలెట్టేస్తున్నారు.
మొత్తానికి చేయగలిగిన చోట గరిష్టంగా దోచుకోవడం.. చేయలేని చోట ‘మేము చాలా మంచోళ్లం’ అని ఫోజులివ్వడం మైత్రీ మూవీ మేకర్స్ కే చెల్లింది.
ఏది ఏమైనా అవకాశం ఉంటే మైత్రీ వారు రూపాయి కూడా వదిలిపెట్టరనేది ఇక్కడ ఓపెన్ సీక్రెట్!
read also: ‘సర్కే చునర్’ పాట వివాదంపై గట్టి కౌంటర్ ఇచ్చిన దర్శకుడి భార్య రక్షిత..