Ustaad Bhagath Singh: మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా సినీ అభిమానులకు పెద్ద ట్రీట్ రాబోతోంది. అదే రోజు రెండు భారీ సినిమాలు థియేటర్లలో విడుదల కావడం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఒకవైపు వస్తుండగా, మరోవైపు బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ నటించిన ధురంధర్ 2 కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.
ఈ రెండు సినిమాలు ఒకే రోజు రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ ఉంటుందని చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన హరీష్ శంకర్ మాట్లాడుతూ… “ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఆయన తీసిన ‘ఉరి’ సినిమా నాకు చాలా నచ్చింది. అలాంటి మంచి దర్శకుడు తీసిన సినిమా కాబట్టి అది మంచి విజయాన్ని సాధించాలి అని కోరుకుంటున్నాను” అని అన్నారు.
అయితే అదే సమయంలో ఆయన మరో ముఖ్యమైన విషయం కూడా చెప్పారు. “ధురంధర్ 2 సినిమా మా సినిమాకు పెద్దగా పోటీగా అనిపించడం లేదు. ఎందుకంటే మా సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో భారీ మార్కెట్ ఉంది. అక్కడ ప్రేక్షకులు ఎక్కువగా తెలుగు సినిమాలనే ఇష్టపడతారు” అని హరీష్ శంకర్ తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ… “ఒకవేళ షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో సినిమా అదే రోజున వస్తే మాత్రం కొంచెం ఆలోచించేవాళ్లం. ఎందుకంటే అలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్, పాటలు, కామెడీతో నిండివుంటాయి. అప్పుడు పోటీ ఎక్కువగా ఉంటుందని అనిపించేది” అని చెప్పారు.
సినిమా విడుదల తేదీ నిర్ణయం ఒక్క దర్శకుడి చేతుల్లో ఉండదని కూడా ఆయన స్పష్టం చేశారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఇతర టీమ్ సభ్యులందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అంతేకాదు, పెద్ద పండుగ సమయంలో రెండు లేదా మూడు పెద్ద సినిమాలు ఒకేసారి వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాలు సాధించే అవకాశం ఉంటుందని హరీష్ శంకర్ తెలిపారు.
మొదటగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను మార్చి 26న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని మార్పుల కారణంగా ఈ సినిమాను ఒక వారం ముందుగా మార్చి 19న రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి పెరిగింది. బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ALSO READ: NBK111 Movie: నందమూరి బాలకృష్ణ ‘NBK111’ షూటింగ్ షురూ.. యాక్షన్ మామూలుగా లేదుగా..