Praveena Deshpande: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో, ముఖ్యంగా బాలీవుడ్, మరాఠీ చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ప్రవీణ దేశ్ పాండే (60) కన్నుమూశారు. గత కొంతకాలంగా ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె, పరిస్థితి విషమించడంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. ఆమె మరణవార్తను ఆమె కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ధృవీకరించారు. ప్రవీణ దేశ్ పాండే మరణవార్త విన్న సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. ఆమె కుటుంబ సభ్యులు (అనిరుద్ధ, అభిమన్యు, రుచిర, వీర్ దేశ్ పాండే) ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక ప్రకటన విడుదల చేస్తూ.. “మా ప్రియతమ ప్రవీణ దేశ్ పాండే ఫిబ్రవరి 17, 2026న స్వర్గస్తులయ్యారని తెలపడానికి ఎంతో విచారిస్తున్నాము” అని పేర్కొన్నారు.
Read also-Actor Mohan Babu: నటుడు మోహన్బాబుకు కష్టాలు.. అరెస్టు తప్పదా? ఏం జరిగింది?
ప్రవీణ దేశ్ పాండే తన సుదీర్ఘ కెరీర్లో థియేటర్, టెలివిజన్, సినిమాలు మరియు వెబ్ సిరీస్లు ఇలా అన్ని విభాగాల్లోనూ రాణించారు. సల్మాన్ ఖాన్ నటించిన సూపర్ హిట్ చిత్రం ‘రెడీ’లో ఆమె పోషించిన పాత్ర ప్రేక్షకులకు బాగా గుర్తుంది. అలాగే సిద్ధార్థ్ మల్హోత్రా, శ్రద్ధా కపూర్ నటించిన ‘ఏక్ విలన్’, జాన్ అబ్రహం చిత్రం ‘పరమాణు: ది స్టోరీ ఆఫ్ పోఖ్రాన్’ వంటి సినిమాల్లో ఆమె కీలక పాత్రల్లో నటించి మెప్పించారు. బుల్లితెరపై కూడా ఆమె చెరగని ముద్ర వేశారు. ‘ఘర్ ఏక్ మందిర్’, ‘కుంకుమ్’, ‘కరం అప్నా అప్నా’ మరియు అత్యంత ప్రజాదరణ పొందిన ‘కుల్ఫీ కుమార్ బాజేవాలా’ వంటి సీరియల్స్లో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆమె చివరిసారిగా నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘తస్కరీ’ అనే వెబ్ సిరీస్లో నటించారు. ఇందులో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషించారు.
Read also-Today Horoscope in Telugu: ఆ రాశి వారికి ప్రముఖులతో పరిచయాలు – వృత్తి వ్యాపారాల్లో పురోగతి
ఆమె మృతి పట్ల ‘సినీ అండ్ టీవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (CINTAA) తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. 2008 నుండి ఆమె అసోసియేషన్లో సభ్యురాలిగా ఉన్నారని గుర్తు చేసుకుంటూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాలీవుడ్ ప్రముఖులు, తోటి నటులు ఆమెతో ఉన్న జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ సోషల్ మీడియాలో నివాళులర్పిస్తున్నారు. ప్రవీణ దేశ్ పాండే మరణం మరాఠీ మరియు హిందీ చిత్ర పరిశ్రమలకు తీరని లోటుగా మిగిలిపోతుంది.