Srinivas Goud: రాష్ట్ర బడ్జెట్లో కల్లు గీత కార్పొరేషన్కు 5000 కోట్లు కేటాయించి గీత కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తి చేసే ప్రతి ఒక్కరికి కాటమయ్య రక్షణ కవచం అందజేయాలని కోరారు. హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరహార దీక్ష లో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారకంగా నిర్వహించేందుకు జీవోను జారీ చేసిందన్నారు. వైన్ షాపులలో గౌడులకు 15%, దళిత మరియు గిరిజనులకు 15% రిజర్వేషన్లు కల్పించడం జరిగిందన్నారు.
ప్రమాదవశాత్తు మరణించిన గీత కార్మిక కుటుంబాలకు ఎక్స్గ్రేషన్ అందజేసిందని, గౌడ్ల ఆత్మగౌరవ భవనం నిర్మాణం కొరకు కోకాపేటలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించి ఐదు కోట్ల రూపాయల కేటాయించిందని, కల్లు దుకాణాల రెంటల్ లను రద్దు చేయడంతో పాటు పాత బకాయిలను మాఫీ చేయడం జరిగిందన్నారు. కల్లు దుకాణాల లైసెన్స్ కాలపరిమితి 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలకు పెంచడంతోపాటు, చెట్టు పన్ను రద్దు చేసిందని వెల్లడించారు. నీరా పాలసీని రూపొందించి గౌడ కులస్తులకే నీరాపై పూర్తి హక్కును కల్పిస్తూ, ట్యాంక్ బండ్ పై నీరా కేఫ్ ను ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిందని, అదేవిధంగా నందనం, మునిపల్లి, చెరికొండ, చారకొండ లలో నీరా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
హరితహారం లో భాగంగా దాదాపు 5 కోట్ల తాటి, ఈత, ఖర్జూరం చెట్లను నాటామన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ గౌడలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కల్లుగీత వృత్తిదారులకు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్ ను 4వేలకు , ఎక్స్గ్రేషియాను 10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. వైన్ షాప్ లలో గౌడ్లకు 25 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. పెండింగ్ లో ఉన్న ఎక్స్ గ్రేషియా ను వెంటనే విడుదల చేయాలని, బీసీలకు విద్య ఉద్యోగం స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, జనగామ జిల్లాకు పాపన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
Also Read: Actor Mohan Babu: నటుడు మోహన్బాబుకు కష్టాలు.. అరెస్టు తప్పదా? ఏం జరిగింది?