Balakrishna: ఇటీవల బాలకృష్ణ అభిమానుల్లో ఒక విషయం తెగ వినిపిస్తోంది. నటనలో ఎప్పుడు ముందుండే బాలకృష్ణకు.. నిర్మాణ విలువలు మాత్రం అస్సలు కలిసి రావడం లేదు అంటూ అభిమానులు సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. సినిమా ప్రొడక్షన్ జోలికి వెళ్లకుండా యాక్టింగ్కే పరిమితం కావాలా.. అని కూడా కోరుకుంటున్నారు. దీనికి కారణాలు కూడా లేకపోలేదు. బాలకృష్ణ నటుడిగా ఎన్నో విజయాలు సాధించినా.. నిర్మాతగా మాత్రం ఆ స్థాయి సక్సెస్ రాలేదన్న అభిప్రాయం బలంగా ఉంది.
బాలకృష్ణ నట జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు 50 ఏళ్లు దాటాయి. ఈ మధ్యనే ఆయన సినీ స్వర్ణోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. ఎన్టీఆర్ స్థాపించిన.. రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్లో బాలయ్య ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తారకరాముడు కేవలం మహానటుడే కాదు..మంచి దర్శకుడు..సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కూడా.. కానీ అదే స్థాయిలో బాలకృష్ణకు ఈ పాత్రలు కలిసి రాలేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
బాలయ్య నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. మాస్ పాత్రలు, పవర్ఫుల్ డైలాగ్స్, ఎనర్జీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కానీ దర్శకుడిగా లేదా నిర్మాతగా మాత్రం అదే మ్యాజిక్ కనిపించలేదన్నది నిజం. ఒకప్పుడు మెగాఫోన్ పట్టి నర్తనశాల.. సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది.
తర్వాత ఎన్బీకే ఫిలిమ్స్ బ్యానర్ పెట్టి కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిర్మాతగా మారారు. ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెరపై చూపాలన్న ఆలోచన గొప్పదే అయినా, ఈ రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఫలితంగా బాలయ్యకు నిర్మాతగా నిరాశే మిగిలింది.
ఈ ఫ్లాప్ల తర్వాత బాలకృష్ణ ప్రొడక్షన్కు దూరంగా ఉన్నారు. తాజాగా అఖండ 2 విషయంలో కూడా ఇలాంటి చర్చే వచ్చింది. ఈ సినిమాకు బాలయ్య కూతురు తేజస్విని సమర్పకురాలిగా వ్యవహరించారు. అయితే ఈ ప్రయత్నం కూడా కలిసి రాలేదన్న టాక్ వినిపిస్తోంది. 95 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా దాదాపు 70 కోట్ల వరకే రాబట్టిందని సమాచారం.
ఈ అన్ని కారణాల వల్లే అభిమానులు బాలయ్యను మీరు నటుడిగానే కొనసాగండి..అని కోరుతున్నారు. నటుడిగా బాలకృష్ణకు ఉన్న ఇమేజ్, క్రేజ్ వేరే లెవల్. ప్రొడక్షన్లో రిస్క్ తీసుకోవడం కంటే, తన బలమైన యాక్టింగ్తోనే ప్రేక్షకులను అలరించాలన్నదే ఫ్యాన్స్ ఆశ.
ALSO READ: Thalaivar 173లో టైలర్గా కనిపించబోతున్న రజనీకాంత్.. కథ మొత్తం లీక్..!