Civil Aviation: ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. అక్కడ గడిచిన పది రోజులుగా పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకు పోయిన వారిని తరలించేందుకు చర్యలు చేపట్టింది కేంద్రప్రభుత్వం. చేపట్టిన చర్యలపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రికి వివరించారు అధికారులు. అంతేకాదు విమాన సర్వీసులపై కీలక సమీక్ష నిర్వహించారు సదరు మంత్రి.
గల్ఫ్ నుంచి స్వదేశానికి భారతీయలు
ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కొన్నాళ్లు గడిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో అక్కడ పరిస్థితులు మరింత జఠిలం కానున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకు పోయిన భారతీయులను తరలించేందుకు వేగంగా చర్యలు చేపట్టింది కేంద్రం.
ఈ నేపథ్యంలో విమాన సర్వీసులపై పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు డిజిసిఎ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. చిక్కుకుపోయిన వారిని తరలించేందుకు చేపట్టిన వివరాలను మంత్రికి వివరించారు అధికారులు. పలుచోట్ల నుంచి విమానయాన సిబ్బంది, ఆయా దేశాల రాయబార కార్యాలయ అధికారులతో సమన్వయం జరుపుతున్నట్లు తెలిపారు.
లక్ష మంది రాక.. విమాన సర్వీసులపై అధికారులతో మంత్రి సమీక్ష
ప్రయాణీకులను సురక్షితంగా తీసుకు వస్తున్న వివరాలను అధికారులు అందజేశారు. ఫిబ్రవరి 28 నుంచి నేటివరకు పలు దేశాల నుంచి భారతీయుల తరలింపుకు సంబంధించిన వివరాలు మంత్రికి అందజేశారు. పది రోజుల్లో దోహా నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చి నగరాలకు ప్రతి రోజు సుమారు 850 మందిని తరలించినట్లు వెల్లడించారు అధికారులు.
అదే విధంగా సౌది అరేబియాలోని దమమ్ ఎయిర్పోర్టు నుంచి కొచ్చికి ప్రతి రోజు 166 మందిని తరలించినట్టు తెలిపారు. మంగళవారం బహ్రెయిన్ నుంచి తెలుగువారికి దమమ్కు తరలించి అక్కడి నుంచి విమానంలో కొచ్చికి తీసుకు వస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు మార్చి 16 వరకు గల్ఫ్లోని వివిధ విమాన సంస్థ… దోహా, దమమ్ విమానాశ్రయాల నుంచి ఢిల్లీ, ముంబై, కొచ్చిలకు భారతీయులను తరలించేందుకు రెడీ చేసిన షెడ్యూల్ను అధికారులు అందజేశారు.
ALSO READ: ఇండిగో సీఈవో ఎల్బర్స్ రాజీనామా.. కారణం అదేనా?
రెండు ఎయిర్ పోర్టుల భారతీయులను తరలించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రికి అధికారులు వివరించారు. విదేశాంగ శాఖ అధికారులతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. భారతీయులను సురక్షితంగా ఇండియాకు తరలించే ఏర్పాట్లు చేశామని తెలిపారు పౌర విమానయాన శాఖ. అన్ని విమానాయాన సంస్థలు సోమవారం వరకు దాదాపు లక్ష మంది భారతీయులను స్వదేశానికి తరలించినట్లు వెల్లడించింది పౌర విమానయాన శాఖ.
తరలింపు ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని, ప్రత్యేకంగా వీసా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. గల్ఫ్ నుంచి వచ్చే విమానాలకు ఎయిర్ ట్రాఫిక్లో ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవడం, ల్యాండింగ్ సమస్యలు రాకుండా చూడాలని డిజిసిఎ అధికారులను ఆదేశించారు.