
Amritpal Singh : ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే నాయకుడు అమృత్పాల్ సింగ్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. ఆదివారం ఉదయం మోగా జిల్లాలోని ఓ గురద్వార్ లో ఉండగా అదుపులోకి తీసుకున్నారు. విద్వేష ప్రసంగాలతో యువతను రెచ్చగొడుతున్న అమృత్పాల్ సింగ్.. మార్చి 18 నుంచి పరారీలో ఉన్నాడు. అతడి కోసం వేల మంది పోలీసులు 35 రోజులపాటు గాలించారు.
అమృత్ పాల్ సింగ్ కు అత్యంత సన్నిహితుడైన లవ్ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్టు చేశారు. ఈ సమయంలో అమృత్పాల్ పిలుపుతో ఫిబ్రవరి 24న భారీ సంఖ్యలో యువత అమృత్సర్ జిల్లాలోని అజ్నాలా పోలీస్స్టేషన్పై దాడికి తెగబడ్డారు. లవ్ప్రీత్ సింగ్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే విద్వేష ప్రసంగాలు చేసినందుకు అమృత్పాల్ సింగ్పై కేసు నమోదైంది.
వేషధారణ, వాహనాలు మార్చుతూ ఇన్నాళ్లూ అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరిగాడు. మరోవైపు అతడి అనుచరులను ఒక్కొక్కరిగా అరెస్టు చేశారు పోలీసులు. పాపల్ ప్రీత్ సింగ్ను ఏప్రిల్ 11న అరెస్టు చేశారు. ఏప్రిల్ 15న జోగా సింగ్ను, ఏప్రిల్ 18న మరో ఇద్దరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అమృత్ పాల్ సింగ్ను అరెస్ట్ చేసిన పోలీసులు.. భద్రతా కారణాల దృష్ట్యా అసోంలోని జైలుకు తరలించాలని భావిస్తున్నారు. అమృత్పాల్ అనుచరుడు పాపల్ ప్రీత్ సింగ్ను అసోం దిబ్రూగఢ్ సెంట్రల్ జైలులో ఉంచారు. ఇప్పటికే అరెస్టైన అతని అనుచరులను కూడా పంజాబ్ నుంచి వేరే రాష్ట్రానికి తరలిస్తారని తెలుస్తోంది.
3 రోజుల క్రితం అమృత్ పాల్ భార్య కిరణ్ దీప్ కౌర్ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె అమృత్సర్ ఎయిర్పోర్టులో లండన్ విమానం ఎక్కేందుకు వెళుతుండగా ఆఖరి నిమిషంలో అరెస్ట్ చేశారు. అమృత్పాల్ కార్యకలాపాలకు కిరణ్ దీప్ మద్దతు ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఆమెను విచారించగా.. కీలక సమాచారం పోలీసులకు దొరికింది. ఆ దిశగా పోలీసులు వేట కొనసాగించగా అమృత్పాల్ తప్పించుకునే మార్గాలు మూసుకుపోయాయి. దీంతో పోలీసులకు చిక్కాడు.
అమృత్పాల్ అరెస్ట్ తర్వాత గోల్డెన్ టెంపుల్, అకల్ తఖ్త్ తోపాటు… అతడి స్వగ్రామం జల్లుపూర్ ఖేరా వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు.