బీహార్-బీడీ వివాదం ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది. మరో రెండు నెలల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన వేళ కాంగ్రెస్ ని కార్నర్ చేస్తూ బీజేపీ మైండ్ గేమ్ మొదలు పెట్టింది. ఈ వివాదంలో కాంగ్రెస్ మిత్రపక్షాలను టార్గెట్ చేయాలని చూస్తోంది బీజేపీ. బీహార్ ని కాంగ్రెస్ అపహాస్యం చేసిందని, బీహార్ ప్రజలను అవమానించిందని బీజేపీ ఆరోపిస్తోంది.
అసలేం జరిగింది..?
జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ఈ గొడవ మొదలైంది. జీఎస్టీలో వివిధ శ్లాబులను తగ్గించిన కేంద్ర ప్రభుత్వం, పొగాకు ఉత్పత్తులపై మాత్రం సుంకాలను పెంచింది. సిగార్లు, సిగరెట్లపై పన్నుల్ని 28 శాతం నుండి 40 శాతానికి పెంచింది. పొగాకుపై పన్ను కూడా 28 శాతం నుండి 40 శాతానికి పెరిగింది. అయితే బీడీలపై మాత్రం కేంద్రం ప్రేమ చూపించడం ఇక్కడ విశేషం. బీడీలపై పన్ను రేటును 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించింది. పొగాకు, సిగరెట్లపై పన్నులు పెంచి, బీడీలపై తగ్గించడాన్ని ఎలా చూడాలి. దీనికి కారణం ఒకటే. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. బీహార్ లో ఎక్కువమంది ప్రజలు బీడీల తయారీని జీవనాధారంగా చేసుకున్నారు. వాటిపై ట్యాక్స్ ల మోత మోగిస్తే ఎన్నికల వేళ అది ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. అందుకే బీడీలపై ట్యాక్స్ ని పెంచకపోగా తగ్గించారు. ఇదే వివాదానికి కారణం.
కేరళ కాంగ్రెస్ శాఖ
బీడీలపై ఎన్డీఏ ప్రభుత్వం చూపించిన ప్రేమపై కాస్త వెటకారంగా స్పందించింది కాంగ్రెస్ పార్టీ. కేరళ కాంగ్రెస్ శాఖ ఓ ట్వీట్ వేసింది. బీడీలు, బీహార్.. రెండూ B అనే అక్షరంతో ప్రారంభమవుతాయి. అందుకే ఇకపై వాటిని పాపంగా పరిగణించలేము అని పేర్కొంటూ.. GST సవరణల చార్ట్ ని కూడా ఆ ట్వీట్ లో పోస్ట్ చేసింది. ఇక్కడ బీహార్ ని, బీడీని కలిపి ట్వీట్ చేయడం వివాదానికి కారణం అయింది. వాస్తవానికి బీడీలపై ఎన్డీఏ ప్రభుత్వం ఎందుకు ప్రేమ చూపించింది అనే విషయాన్ని హైలైట్ చేయడం కాంగ్రెస్ ఉద్దేశం. కానీ అనుకోకుండా బీడీలు, బీహార్ అని కలిపి పదప్రయోగం చేయడంతో వైరివర్గం ఈ వ్యవహారాన్ని తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోంది.
ఆర్జేడీ వైఖరి ఏంటి?
బీహార్ పై కాంగ్రెస్ కి చిన్నచూపు ఉందని, అందుకే బీడీలతో పోల్చి చెప్పారని ఎన్డీఏ నేతలు విమర్శలు మొదలు పెట్టారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి కాంగ్రెస్ వ్యాఖ్యల్ని.. బీహార్ రాష్ట్రానికి జరిగిన అవమానంగా అభివర్ణించారు. ఇటీవల కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీ తల్లిని అవమానించారని, ఇప్పుడు మొత్తం బీహార్ ప్రజల్ని అవమానిస్తున్నారని అన్నారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనవాలా కూడా కాంగ్రెస్ను విమర్శించారు. ఆ పార్టీ అన్ని పరిమితులను దాటిందని అన్నారు. జేడీయూ కూడా కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ ఆరోపణలు గుప్పించింది. అదే సమయంలో కాంగ్రెస్ వ్యాఖ్యల్ని రాష్ట్రీయ జనతాదళ్-RJD సమర్థిస్తుందా అని ప్రశ్నించింది. బీహార్ పట్ల కేంద్రం ఉదారంగా ప్రవర్తించిన ప్రతిసారీ కాంగ్రెస్ ఇలాగే విమర్శలు చేస్తోందని ఎన్డీఏ నేతలు అంటున్నారు.
రాజకీయ లబ్ధి ఎవరికి?
మరి ఈ వివాదాన్ని బీహార్ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారనేది వేచి చూడాలి. కేవలం ఎన్నికలకోసమే బీడీలపై పన్ను తగ్గించిన కేంద్రం.. కాంగ్రెస్ నుంచి వచ్చిన ట్వీట్ ని మరింత వివాదం చేయాలని చూడటం విశేషం. ఈ ఎపిసోడ్ లో ఎవరికి రాజకీయ లబ్ధి జరుగుతుంది, ఎంతమేర జరుగుతుంది, ఎన్నికల్లో దాని ఫలితం ఎలా ఉంటుందనేది వేచి చూడాలి.