ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ప్రజారవాణా సౌకర్యవంతంగా ఉండటంతోపాటు, చౌకగా కూడా ఉంటుంది. అయితే కేవలం ప్రైవేట్ రంగంలో మాత్రమే ఈ రవాణా సాధనాలు ఉంటే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పవు. ఓలా, ఉబెర్ వచ్చిన కొత్తల్లో వాటి వల్ల చార్జీలు తగ్గాయని, ఆటోవాలాలు అడిగినంత ఇవ్వక్కర్లేదనే ప్రచారం జరిగింది. కానీ రాను రాను ఆటోలు, ట్యాక్సీలకు ఓలా, ఉబెర్ గట్టి ప్రత్యామ్నాయంగా మారడంతో అసలు కథ మొదలైంది. ఓలా, ఉబెర్ రేట్లు పెంచేయడం, పీక్ అవర్స్ లో ముక్కుపిండి వసూలు చేయడం సర్వ సాధారణం అయింది. దీంతో ఓలా, ఉబెర్ వల్ల మనకు ఒరిగేదేమీ లేదని అర్థమైంది. అయితే వాటికి ప్రత్యామ్నాయం కనిపెట్టడమే కాస్త ఇబ్బందిగా మారింది. అయినా కూడా పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా ట్యాక్సీ సర్వీసులను మొదలు పెట్టాయి. వెస్ట్ బెంగాల్ లో ‘యాత్రి సాథి’ పేరుతో ట్యాక్సీ సర్వీసు నడుస్తోంది. కోల్కతాతో సహా ప్రధాన నగరాల్లో ఈ ట్యాక్సీ సర్వీస్ ప్రజలకు అందుబాటులో ఉంది. కేరళలో 2022లో కేరళ ప్రభుత్వం ‘కేరళ సవారీ’ పేరుతో ట్యాక్సీ సర్వీస్ ప్రారంభించింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల దానిని నిలిపివేశారు. ఈలోగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ముందడుగు వేసింది. ప్రభుత్వ నిర్వహణలో ట్యాక్సీ సర్వీస్ ని మొదలు పెట్టబోతోంది.
మహా రైడ్..
ట్యాక్సీ సర్వీస్ లలో ఓలా, ఉబెర్ ఆధిపత్యాన్ని తగ్గించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం సొంత ట్యాక్సీ యాప్ను ప్రారంభించబోతోంది. ట్యాక్సీలు, ఆటో-రిక్షా, బైక్ ట్యాక్సీల కోసం సొంత యాప్ ఆధారిత రవాణా వేదికను ప్రకటించారు మహారాష్ట్ర రవాణా మంత్రి ప్రతాప్ సర్నాయక్. దీని ద్వారా లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారాయన. జై మహారాష్ట్ర, మహా-రైడ్, మహా-యాత్రి, మహా-గో అనే పేర్లలో ఒకటి ఫైనల్ చేయబోతున్నారు. ఈ యాప్ను మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్పోర్ట్ టెక్నాలజీ (MITT), మిత్రా ఆర్గనైజేషన్, ప్రైవేట్ టెక్ భాగస్వాముల మద్దతుతో అభివృద్ధి చేస్తున్నారు.
గుత్తాధిపత్యం ఉండదు..
మహారాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న ప్రభుత్వ యాప్ ద్వారా ప్రైవేట్ అగ్రిగేటర్ల గుత్తాధిపత్యం తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ధరలు కూడా తగ్గుతాయి. అదే సమయంలో ప్రైవేట్ ఆపరేటర్లకు వెళ్లే కమీషన్లు ఇక్కడ డ్రైవర్లకే అందుతాయి. అంటే ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటుంది కాబట్టి.. ప్రయాణికులు, డ్రైవర్లు.. ఇద్దరూ ఇక్కడ లాభపడే అవకాశం ఉంది.
అన్నీ పక్కాగా..
ప్రస్తుతం ప్రైవేట్ అగ్రిగేటర్లకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రియల్-టైమ్ ట్రాకింగ్, పారదర్శక ఛార్జీలు, డ్రైవర్ భద్రత, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలు.. ఈ ప్రభుత్వ సర్వీస్ లో కూడా ఉంటాయి. ఇక ప్రభుత్వం ఈ యాప్ ద్వారా ట్యాక్సీలు నడపాలనుకునే యువతకు వాహనాల కొనుగోళ్లకోసం వడ్డీ లేని రుణాలను అందించబోతోంది. ముంబై బ్యాంక్ ద్వారా రుణాలు ఇప్పిస్తూ వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీని అందిస్తారు. గతంలో కేంద్రం కూడా సహకార్ ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తేవాలని ప్రయత్నించింది కానీ అది పూర్తి స్థాయిలో సాధ్యపడలేదు. ఇప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం ప్రభుత్వ ట్యాక్సీ సర్వీస్ లను తేవాలనుకోవడం విశేషం. ఈ దిశగా ఇప్పుడు మహారాష్ట్ర ముందడుగు వేస్తోంది.