RJD Tejashwi Yadav: రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ ఎట్టకేలకు విజయం సాధించారు. లాలూ కుటుంబం కంచుకోట అయిన రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీకి చెందిన సతీష్ కుమార్పై 14,532 ఓట్ల తేడాతో తేజస్వి విజయం సాధించారు. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్ లో చివరి విజయం తేజస్విని వరించింది. 16వ రౌండ్ కౌంటింగ్ వరకు తేజస్వి దాదాపు 5,000 ఓట్లు వెనుకబడి ఉన్నారు. చివరి దశలో బలంగా పుంజుకుని సతీష్ కుమార్ పై విజయం సాధించారు. తేజస్వి యాదవ్ కు మొత్తం 1,19,780 ఓట్లు పోలైయ్యాయి. 25 స్థానాల్లో ఆర్జేడీ ముందంజలో కొనసాగుతోంది.
బీహార్ వైశాలి జిల్లాలోని కీలకమైన రాఘోపూర్ అసెంబ్లీ స్థానం చాలా ఏళ్లుగా లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబం, రాష్ట్రీయ జనతా దళ్కు కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గంలో యాదవ్ సామాజిక వర్గం ఓట్లు చాలా కీలకం. దాదాపు 1.25 లక్షల మంది యాదవ ఓటర్లు, రాజ్పుత్లు, షెడ్యూల్డ్ కులాలు, ఇతర ఓబీసీల కంటే ఎక్కువ శాతంలో ఉన్నారు.
యాదవ సామాజిక వర్గం ఆధిక్యతతో ఆర్జేడీ, లాలూ కుటుంబానికి రాఘోపూర్ కంచుకోటగా మారింది. లాలూ ప్రసాద్ యాదవ్, మాజీ సీఎం రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్ కలిసి ఏడుసార్లు ఇక్కడ నుంచి గెలుపొందారు. 2015, 2020లో తేజస్వి రాఘోపూర్ నుంచి సునాయాసంగా గెలిచారు. ఈసారి స్థానికంగా ఉన్న అసంతృప్తి, యాదవ్ ఓటర్లు బీజేపీ వైపు ఆసక్తి చూపడంతో తేజస్వి యాదవ్ విజయం అంత సులభంగా దక్కలేదు.
Also Read: Nitish Kumar: ఎమ్మెల్యే కూడా కాకుండా 20 ఏళ్లుగా సీఎం, ఈసారి కూడా.. నితీష్కే పగ్గాలు?
రాఘోపూర్ నియోజకవర్గం యాదవ్ ఓటర్ల ఆధిపత్యం, లాలూ కుటుంబం పొత్తుతో చుట్టూ తిరుగుతుంది. రాఘోపూర్ నుంచి తేజస్వి గెలిచినప్పటికీ, బీహార్ ఎన్నికల్లో ఆర్జేడీ ఓటమి పాలైంది. మహాఘట్ బంధన్ 243 స్థానాల బీహార్ అసెంబ్లీలో 34 సీట్లకు పైగా గెలుచుకోలేకపోయింది.