బీహార్ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో వైరల్ గా మారింది. మోదీ తల్లి కనపడుతున్న ఆ వీడియోని బీజేపీ తీవ్రంగా తప్పుబడుతోంది. ఇప్పటికే మోదీ తల్లిని బీహార్ కాంగ్రెస్ కూటమి అవమానించిందని, మరోసారి డీప్ ఫేక్ వీడియోతో వారు మరింత పెద్ద తప్పు చేశారని బీజేపీ నేతలు అంటున్నారు. బీహార్ ఎన్నికల వేళ ఈ వీడియో సంచలనంగా మారింది.
ఆ వీడియోలో ఏముంది?
ఈరోజు ఓట్ చోరీ పని పూర్తయిందని అనుకుంటూ ప్రధాని మోదీ నిద్రకు ఉపక్రమిస్తారు. ఆయన నిద్రపోయిన సమయంలో ఆయన తల్లి పోలికలతో ఉన్న ఒక పెద్దావిడ కలలో కనపడుతుంది. మోదీ చేసిన తప్పుల్ని వివరిస్తూ, ఇకపై అలాంటివి చేయకూడదని హితవు పలుకుతుంది. బీహార్ ఎన్నికల వేళ తన పేరుతో పోస్టర్లు వేసి సింపతీ కోసం చూస్తున్నారని కోప్పడుతుంది. ఆమె మాటలకు ఆయన ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్ర లేస్తారు. ఇక్కడితో ఆ వీడియో పూర్తవుతుంది. 36 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియో డీప్ ఫేక్ టెక్నాలజీ ద్వారా రూపొందించారు. సాహెబ్ కి కలలో అమ్మ వచ్చింది అనే క్యాప్షన్ పెట్టి ఆ వీడియోని సోషల్ మీడియాలో బీహార్ కాంగ్రెస్ పార్టీ పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది.
బీజేపీ విమర్శలు..
కాంగ్రెస్ పని అయిపోయిందని, పూర్తిగా ఆ పార్టీ దిగజారిపోయిందని అంటున్నారు బీజేపీ నేతలు. పదే పదే మోదీ తల్లి పేరుని ప్రస్తావించడం వారికి అలవాటైపోయిందని అంటున్నారు. ఇప్పుడు ఏకంగా ఆమె డీప్ ఫేక్ వీడియోతో మరింత పెద్ద తప్పు చేశారని విమర్శించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి తల్లిని కాంగ్రెస్ అవమానించిందని అన్నారాయన. ప్రధాని తల్లి అందరికీ తల్లి అని, ఆమెను అవమానించిన కాంగ్రెస్కు బీహార్ ప్రజలు గట్టి గుణపాఠం నేర్పుతారని ఆయన మండిపడ్డారు. రాజకీయాల్లో కాంగ్రెస్ మరింత దిగజారిందని విమర్శించారు బీజేపీ ఎంపీ రాధాకృష్ణ మోహన్ దాస్. కాంగ్రెస్ డీప్ ఫేక్ వీడియోపై బీజేపీ ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ వీడియోతో ఆ పార్టీ అన్ని హద్దులు అతిక్రమించిందని, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు.
కాంగ్రెస్ రియాక్షన్..
అసలు ఆ వీడియోలో తప్పేముందని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. రాజకీయాల్లో ఉన్న ప్రధాని మోదీ ఇలాంటి సున్నిత విమర్శలను కూడా తీసుకోకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. పదే పదే తల్లిని అవమానించారని బీజేపీ నేతలు అంటున్నారని, అక్కడ అమానపరిచే సన్నివేశం కానీ, పదం కానీ లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ తప్పు చేయలేదని, ఆ వీడియోలో ఎక్కడా తప్పు లేదని వారు అంటున్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికల వేళ కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదాలు మరింతగా ముదురుతున్నాయి. కాంగ్రెస్ సోషల్ మీడియా వార్ కి సిద్ధమైంది. బీజేపీ కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ విమర్శలను తిప్పికొడుతోంది. ఇటీవల బీడీపై జీఎస్టీ తగ్గించడంతో బీహార్-బీడీ వివాదం మొదలైంది. దానికి కొనసాగింపుగా ఇప్పుడు మోదీ తల్లి డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది.