Karnataka Latest Updates(BJP Party News) : అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు మరో 9 రోజుల మాత్రమే సమయం ఉంది. మే 10న అక్కడ పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలను కర్ణాటకలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తనదైన శైలిలో ప్రచారం సాగిస్తున్నారు. అటు జేడీఎస్ ప్రజలకు హామీలు గుప్పిస్తోంది. ఇలా ఓటర్లను ఆకర్షించేందుకు పార్టీలన్నీ హామీల వర్షం కురిపిస్తున్నాయి.
తాజాగా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రజా ప్రణాళిక పేరుతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా మేనిఫెస్టోను విడుదల చేశారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప , ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించడం, సంక్షేమం కల్పించడమే బీజేపీ విజన్ అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో పేర్కొంది. యువతకు హామీలు వరాలు ఇచ్చింది. 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించింది. పేదలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇటీవల రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ‘నందిని’ పాల బ్రాండ్ అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చింది. పేద కుటుంబాలకు రోజూ ఉచితంగా అర లీటరు నందిని పాలు ఇస్తామని ప్రకటించింది. పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్ కిట్ ఇస్తామని తెలిపింది. పేద కుటుంబాలకు ఏటా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కొక్కటి చొప్పున ఇస్తామని పేర్కొంది.
బీజేపీ ఇచ్చిన హామీలు..
మైసూర్ ఫిల్మ్ సిటీకి దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ పేరు
కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు
బెంగళూరుకు స్టేట్ క్యాపిటల్ రీజియన్ ట్యాగ్
ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాలు
నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాలు
ప్రతి వార్డుకో లాబోరేటరీ
వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్ చెకప్లు
ఎస్సీ,ఎస్టీ మహిళలకు ఫిక్స్డ్ డిపాజిట్ పథకం
ప్రతిపక్ష కాంగ్రెస్ ఇంకా తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించలేదు. మరి కాంగ్రెస్ ఎలాంటి హామీలు ఇస్తుందో చూడాలి.