Apps : ఉగ్రవాదుల కమ్యూనికేషన్ వ్యవస్థలపై కేంద్ర నిఘా పెట్టింది. జమ్ము కశ్మీర్లోని ఉగ్రవాదులకు పాకిస్థాన్ నుంచి కోడెడ్ సందేశాలు పంపేందుకు వాడుతున్న 14 మొబైల్ యాప్స్ను కేంద్రం బ్లాక్ చేసింది. పాకిస్థాన్లోని ఉగ్రవాదులు కశ్మీర్లో క్షేత్ర స్థాయిలో పనిచేసే వారికి, ఇతర ఆపరేటీవ్లకు సూచనలు, సందేశాలు పంపేందుకు వీటిని వినియోగిస్తున్నారని నిర్ధారించింది.
జాతీయ భద్రతకు ముప్పుగా మారిన మొబైల్ అప్లికేషన్లపై కొన్నాళ్లుగా కేంద్రం కొరడా ఝలిపిస్తోంది. తాజాగా బ్లాక్ చేసిన యాప్స్ లో క్రిప్వైజర్, ఎనిగ్మా, సేఫ్వైజ్, ఐఎంవో, ఎలిమెంట్, సెకండ్ లైన్, జంగీ, వికర్మి, బ్రియార్, బీఛాట్, నాండ్బాక్స్, కొనియాన్, త్రిమా ఉన్నాయి.
దేశంలోని భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సిఫార్సులతో కేంద్ర ఈ నిర్ణయం తీసుకుంది. ఈ యాప్స్ భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. అలాగే జాతీయ భద్రతకు ముప్పుగా మారాయి. దీంతోపాటు ఉగ్రవాదం ప్రచారంలోనూ ఈ యాప్స్ వాడుతున్నారు. కశ్మీర్లోని క్షేత్రస్థాయి ఉగ్రవాదుల కదలికలు, వారి సమాచార మాధ్యమాలపై ఏజెన్సీలు నిఘాపెట్టాయి. కొన్ని యాప్స్నకు దేశీయంగా ఒక్క ప్రతినిధి కూడా లేని విషయం వెలుగులోకి వచ్చింది.
ఇప్పటి వరకు కేంద్రం దాదాపు 250 చైనా యాప్స్పై నిషేధం విధించింది. దేశ సార్వభౌమాధికారతను, సమగ్రతను కాపాడటానికి, జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ యాప్స్ పై నిషేధం విధించామని కేంద్రం స్పష్టం చేసింది. టిక్ టాక్ లాంటి పాపులర్ యాప్స్ ను కేంద్రం గతంలో నిషేధించింది.