MiG-21: భారత వాయుసేన గగనతలంలో ఒక శకం ముగియనుంది. ఆరు దశాబ్దాలకు పైగా భారత రక్షణ వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన లెజెండరీ మిగ్-21 యుద్ధ విమానాలు తమ లాంగ్ జర్నీని ముగించనున్నాయి. నేటితో ఈ చారిత్రాత్మక ఫైటర్ జెట్కు వాయుసేన అధికారికంగా వీడ్కోలు పలకనుంది. ఇకపై వీటి స్థానాన్ని స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన తేజస్, ఫ్రాన్స్కు చెందిన రఫేల్ వంటి ఆధునిక యుద్ధ విమానాలు భర్తీ చేయనున్నాయి.
1971, కార్గిల్ యుద్ధాల్లో గగనతనంలో కీలక పాత్ర..
1963లో సోవియట్ యూనియన్ వెలుపల ఈ సూపర్సోనిక్ ఫైటర్ జెట్ను వినియోగించిన తొలి దేశంగా భారత్ నిలిచింది. అప్పటి నుంచి భారత వాయుసేనలో మిగ్-21 కీలక భాగంగా మారింది. ముఖ్యంగా 1965, 1971 పాకిస్థాన్తో జరిగిన యుద్ధాల్లో ఇది తన సత్తా చాటింది. 1971 యుద్ధంలో అమెరికా తయారీ ఎఫ్-104 స్టార్ఫైటర్ను కూల్చివేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత 1999 కార్గిల్ యుద్ధంలోనూ పర్వత ప్రాంతాల్లోని శత్రు స్థావరాలపై దాడులు చేయడంలో కీలక పాత్ర పోషించింది.
మిగ్-21 స్థానంలోకి రానున్న స్వదేశీ తేజస్, రఫేల్ విమానాలు
మిగ్-21 పేరు చెప్పగానే చాలా మందికి 2019లో వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ గుర్తుకువస్తారు. ఆయన తన మిగ్-21 బైసన్ విమానంతో పాకిస్థాన్కు చెందిన ఆధునిక ఎఫ్-16 విమానాన్ని కూల్చివేసి చరిత్ర సృష్టించారు. తరాలు మారినా ఈ విమానం ఎంతటి శక్తిమంతమైనదో ఆ ఘటన నిరూపించింది. ఎందరో భారత పైలట్లకు శిక్షణ ఇచ్చి, వారిని యుద్ధ నిపుణులుగా తీర్చిదిద్దడంలో మిగ్-21 పాత్ర ఎనలేనిది.
ఇక చరిత్ర పుటల్లోకి చేరనున్న మిగ్-21
అయితే విజయాలతో పాటు మిగ్-21కు వివాదాలు కూడా ఉన్నాయి. కాలం చెల్లిన సాంకేతికత, నిర్వహణ సమస్యల కారణంగా తరచూ ప్రమాదాలకు గురవుతూ ఎగిరే శవపేటిక ఫ్లయింగ్ కాఫిన్ అనే అపఖ్యాతిని మూటగట్టుకుంది. ఈ ప్రమాదాల్లో వందలాది మంది పైలట్లు ప్రాణాలు కోల్పోవడంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే వాయుసేన ఆధునికీకరణలో భాగంగా మిగ్-21 విమానాలను పూర్తిగా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విజయాలు, విషాదాలతో నిండిన తన ప్రస్థానాన్ని ముగించుకుని మిగ్-21 ఇక చరిత్ర పుటల్లోకి చేరనుంది.