Power Plant Blast Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని శక్తి జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. వేదాంత లిమిటెడ్ పవర్ ప్లాంట్లో సంభవించిన పేలుడులో తొమ్మిది మంది కార్మికులు అక్కడికక్కడే మరణించగా, 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సింగితరాయ్ గ్రామంలోని ఈ ప్లాంట్లో మధ్యాహ్నం సమయంలో బాయిలర్ ట్యూబ్ పేలడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని సమాచారం.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక యంత్రాంగం, పోలీసు బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. కాగా, శిథిలాల కింద మరికొందరు కార్మికులు చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు, దీంతో గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశారు.
ప్లాంట్లో పని జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో బాయిలర్ పేలడంతో అక్కడున్న కార్మికులు చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ ప్రమాద తీవ్రతకు ప్లాంట్ భవనం కొంత మేర దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు వేదాంత యాజమాన్యం మరియు ప్రభుత్వం పరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
Read Also: బెంబేలెత్తిస్తున్న ఎండలు.. 22 జిల్లాల్లో 42 డిగ్రీలు దాటిన టెంపరేచర్, ఈ టైంలో జాగ్రత్త!