Narayana Murthy: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు, ఐటీ దిగ్గజం నారాయణ మూర్తి మరోసారి భారతీయ యువత పని సంస్కృతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం వేగంగా ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే యువత కష్టపడి ఎక్కువ గంటలు పని చేయాలని అన్నారు. ఈ విషయంలో ప్రపంచంలో రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాను ఉదాహరించారు. భారత్ చైనాను అధిగమించడానికి చైనాలోని ‘9-9-6’ పని విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
గతంలో.. నారాయణ మూర్తి యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సూచించినప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ, విమర్శలు, సానుకూలత వ్యక్తమయ్యాయి. ఆ వ్యాఖ్యల నుంచి వెనక్కి తగ్గకుండా.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మూర్తి తన అభిప్రాయాన్ని మరింత బలంగా సమర్థించుకున్నారు.
చైనాలో అమలైన 9-9-6 పని సంస్కృతి అంటే ఉద్యోగులు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు వారంలో 6 రోజులు పని చేయడం. దీని ప్రకారం… చైనా ఉద్యోగులు వారానికి దాదాపు 72 గంటలు పని చేస్తారు. ఇది మూర్తి 2023లో సూచించిన 70 గంటల పని విధానానికి చాలా దగ్గరగా ఉంది. అలిబాబా, హువావే వంటి దిగ్గజ టెక్ కంపెనీలలో ఈ విధానం అమలవడంతోనే చైనా వేగంగా ఆర్థికంగా ఎదిగిందని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి చెందాలంటే ఇక్కడి యువత కూడా చైనాలో మాదిరిగా అధిక గంటలు కష్టపడాలని ఆయన పిలుపునిచ్చారు.
యువత వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై దృష్టి పెట్టే ముందు, దేశం భవిష్యత్తు కోసం కష్టపడి పనిచేసి, తమ జీవితాన్ని నిర్మించుకోవాలని నారాయణ మూర్తి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఒక ప్రశ్నకు బదులిస్తూ భారతదేశం చైనాను అధిగమించాలంటే ప్రతి పౌరుడి నుంచి అసాధారణమైన కృషి అవసరమని స్పష్టం చేశారు. కేవలం కష్టం మాత్రమే కాకుండా చైనాతో సమానంగా ఎదగాలంటే అన్ని స్థాయిల్లో కఠినమైన ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు.
అయితే, చైనాలోని 9-9-6 సంస్కృతి అధిక ఒత్తిడి, మానసిక సమస్యలకు దారితీస్తుందని తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ కారణంగానే 2021లో చైనా సుప్రీంకోర్టు ఈ పద్ధతిని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. అయినప్పటికీ, ఆచరణలో పూర్తి మార్పు రాలేదని నివేదికలు చెబుతున్నాయి. ఈ విమర్శలు ఉన్నప్పటికీ, దేశాభివృద్ధి కోసం యువత అసాధారణంగా కృషి చేయాలన్న తన మాటపై నారాయణ మూర్తి మాత్రం గట్టిగా నిలబడ్డారు. మూర్తి తాజా వ్యాఖ్యలు మరోసారి జాతీయ స్థాయిలో ‘పని గంటలు, దేశాభివృద్ధి అనే అంశాలపై విస్తృత చర్చకు దారితీసే అవకాశం ఉంది.
ALSO READ: Indiramma Saree Scheme: కోటి మహిళలకు ఇందిరమ్మ చీరలు.. రెండు దశల్లో పంపిణీకి సీఎం రేవంత్ శ్రీకారం