Rammohan Naidu: భారతీయ పౌర విమానయాన రంగంలో సోమవారం ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) అత్యంత ప్రతిష్టాత్మకంగా, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అడ్వాన్స్డ్ లైట్ సివిల్ హెలికాప్టర్ “ధ్రువ్ ఎన్జీ” (Dhruv NG – Next Gen) తొలి పరీక్షా విమానాన్ని (Test Flight) కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. ఇది భారతీయ ఏవియేషన్ రంగంలో ఒక చారిత్రాత్మక “లిఫ్ట్ ఆఫ్” అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన “ఆత్మనిర్భర భారత్” ఆశయ సాధనలో ఇదొక కీలక మైలురాయి అని కొనియాడారు. కేవలం సైనిక అవసరాలకే కాకుండా, పౌర మరియు వాణిజ్య అవసరాల కోసం (Civil and Commercial use) ప్రత్యేకంగా రూపొందించిన ఈ రోటరీ వింగ్ హెలికాప్టర్, మన దేశీయ ఇంజినీరింగ్ నైపుణ్యానికి, సాంకేతిక పరిజ్ఞానానికి గర్వకారణంగా నిలుస్తుందన్నారు.
ప్రపంచ స్థాయి ప్రమాణాలతో హెలికాప్టర్లను డిజైన్ చేసి, అభివృద్ధి చేసి, స్వయంగా తయారు చేసే సత్తా భారత్కు ఉందని ఈ ప్రయోగం మరోసారి చాటిచెప్పిందని మంత్రి పేర్కొన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో.. భారత్ “దిగుమతులపై ఆధారపడటం” (Import Dependency) అనే దశ నుంచి “స్వదేశీ విశ్వసనీయత” (Indigenous Reliability) వైపు దృఢంగా అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. దేశీయంగా తయారైన శక్తివంతమైన ఇంజిన్తో కూడిన ఈ ధ్రువ్ హెలికాప్టర్, భవిష్యత్తులో భారత్ను ‘గ్లోబల్ ఏవియేషన్ మాన్యుఫ్యాక్చరింగ్ హబ్’గా తీర్చిదిద్దడంలో ఎంతో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
Read Also: Raihan Vadra Engagement: ప్రియాంక గాంధీ ఇంట పెళ్లి బాజాలు.. రైహాన్ వాద్రా నిశ్చితార్థం!