Raihan Vadra Engagement: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంట పెళ్లి సందడి మొదలైంది. వారి కుమారుడు రైహాన్ వాద్రా (25) ఓ ఇంటివాడు కాబోతున్నారు. తన చిరకాల స్నేహితురాలు అవివా బేగ్తో రైహాన్ నిశ్చితార్థం ఖరారైంది.
గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న అవివా బేగ్కు రైహాన్ నిన్న ఇరువురి కుటుంబాల సమక్షంలో ప్రపోజ్ చేయగా, ఆమె అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ శుభకార్యాన్ని పురస్కరించుకుని రెండు కుటుంబాలు రాజస్థాన్లోని రణతంబోర్కు చేరుకున్నాయి. రేపు (బుధవారం) రణతంబోర్లో వీరి నిశ్చితార్థ వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం రాహుల్ గాంధీ సహా గాంధీ, వాద్రా, బేగ్ కుటుంబ సభ్యులు రణతంబోర్లోని ప్రసిద్ధ ‘షేర్ బాగ్’ హోటల్లో బస చేశారు. వీరు జనవరి 2, 2026 వరకు అక్కడే ఉండి నూతన సంవత్సర వేడుకలను కూడా జరుపుకోనున్నారు. వీరి వివాహం మరో రెండు, మూడు నెలల్లో జరిగే అవకాశం ఉందని కుటుంబ వర్గాలు తెలిపాయి.
అవివా బేగ్ ఢిల్లీకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇమ్రాన్ బేగ్, ఇంటీరియర్ డిజైనర్ నందితా బేగ్ కుమార్తె. విశేషమేమిటంటే.. ప్రియాంక గాంధీ, నందితా బేగ్ చాలా కాలంగా మంచి స్నేహితులు. కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం (ఇందిరా భవన్) ఇంటీరియర్ పనుల్లో ప్రియాంకకు నందితా సహకరించారని సమాచారం. అవివా బేగ్ జర్నలిజం, మీడియా కమ్యూనికేషన్లో డిగ్రీ పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటీరియర్ డిజైనర్గా, ఫోటోగ్రాఫర్గా రాణిస్తున్నారు.
రైహాన్ వాద్రా డెహ్రాడూన్లోని డూన్ స్కూల్, లండన్లోని స్కూల్ ఆఫ్ ఓరియంటల్ అండ్ ఆఫ్రికన్ స్టడీస్ (SOAS)లో విద్యనభ్యసించారు. చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీపై మక్కువ ఉన్న రైహాన్, విజువల్ ఆర్టిస్ట్గా గుర్తింపు పొందారు. 2017లో కంటికి గాయమైన తర్వాత ఆయన ‘డార్క్ పెర్సెప్షన్’ పేరుతో ఏర్పాటు చేసిన సోలో ఫోటో ఎగ్జిబిషన్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
Read Also: Capital Dome: ఢిల్లీకి అభేద్యమైన రక్షణ కవచం.. డ్రోన్ల వేటకు ‘క్యాపిటల్ డోమ్’!