Karnataka Election News(Telugu news live): కర్ణాటక ఎన్నికల ప్రచారంలో అవినీతి అంశమే బిగ్ పాయింట్ గా నిలిచింది. కాంగ్రెస్ తన ప్రచారాస్త్రంగా ఇదే అంశాన్ని జనంలోకి బలంగా తీసుకెళ్లింది. ప్రతి పనిలోనూ బీజేపీ సర్కార్ 40 శాతం వాటా తీసుకుంటుందనే ఆరోపణలను కాంగ్రెస్ నేతలు నిత్యం ప్రచారంలో ఉంచారు. సీఎం బసవరాజ్ బొమ్మై అవినీతికి పాల్పుడుతున్నారని పదేపదే విమర్శలు గుప్పించారు. ఈ సర్కార్ ను దించేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
40 శాతం కమీషన్ సీఎం అనే స్లోగన్ ను కాంగ్రెస్ ఏడాది నుంచి ప్రచారం చేస్తోంది. ఈ ఆరోపణలకు కౌంటర్ ఇవ్వడంలో బీజేపీ ఫెయిల్ అయ్యింది. అవినీతి ఆరోపణలను బీజేపీ నేతలు సరిగ్గా తిప్పికొట్టలేకపోయారు. 2021 జూలైలో కర్ణాటక రాష్ట్ర కాంట్రాక్టర్స్ అసోసియేషన్ చైర్మన్ డి.కెంపన్న ఈ ఆరోపణలు తొలిసారిగా చేశారు. బిల్లుల చెల్లింపునకు 40 శాతం కమీషన్ అడుగుతున్నారని ప్రధాని మోదీకే లేఖ రాయడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది. 40 శాతం కమీషన్ ఆరోపణలను పోలింగ్ రోజు వరకు కాంగ్రెస్ సజీవంగా ఉంచింది.
PayCM పేరుతో కర్ణాటకలో వాల్ పోస్టర్లు వేయడం అప్పట్లో తీవ్ర దుమారం రేపింది. వాస్తవానికి ఈ ప్రచారానికి ఆద్యుడు ప్రధాని మోదీ అనే చెప్పుకోవాలి . ఎందుకంటే 2018 ఎన్నికల ప్రచారంలో అప్పటి సీఎం సిద్దరామయ్యను సిద్ద “రూపాయ” అని మోదీ విమర్శించారు. 10 శాతం కమీషన్ సీఎం అని ఆరోపించారు. ఆ స్లోగన్ 2023 ఎన్నికల నాటికి 40 శాతం కమీషన్ సీఎంగా మారింది. కమలంపై అవినీతి మరకలను వేసింది. అందుకే కమలం వాడిపోయింది.