Rahul Gandhi : గుజరాత్ లోని సూరత్ సెషన్స్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.
ట్రయల్ కోర్టు ఈ కేసును పారదర్శకంగా విచారణ చేపట్టకుండా కఠినంగా వ్యవహరించిందని రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. శిక్షను నిలిపివేయకపోతే తన ప్రతిష్టకు నష్టంం కలుగుతుందని పేర్కొన్నారు. రాహుల్ దాఖలు చేసిన పిటిషన్పై గత గురువారం వాదనలు పూర్తయ్యాయి. సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగేరా.. తీర్పును ఈ గురువారానికి రిజర్వు చేశారు. తాజాగా రాహుల్ గాంధీ పిటిషన్ ను కొట్టివేస్తున్న ప్రకటించారు.
2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్లో రాహుల్ .. మోదీ ఇంటిపేరుపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ అంటూ పలు పేర్లను ప్రస్తావించారు. దీనిపై సూరత్ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ రాహుల్పై పరువు నష్టం కేసు వేశారు. గత నెలలో సూరత్ దిగువ కోర్టు విచారణ జరిపి రాహుల్ ను దోషిగా తేల్చింది. రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేసింది. అలాగే పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను 30 రోజులపాటు నిలిపివేసింది.
కోర్టు తీర్పు వచ్చిన 24 గంటలలోపే రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని లోక్ సభ సచివాలయం రద్దు చేసింది. దీంతో కోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సూరత్ సెషన్స్ కోర్టును రాహుల్ గాంధీ ఆశ్రయించారు. అక్కడా ఇప్పుడు చుక్కెదురుకావడంతో గుజరాత్ హైకోర్టును ఆశ్రయించనున్నారు.