Delhi Govt : దిల్లీలో గాలి కాలుష్యం ఏ స్థాయికి చేరుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముక్కులకు మాస్కులు పెట్టుకున్నా.. విష వాయువులు ఏటా లక్షల మంది ప్రాణాలను తీసేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దిల్లీలో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా.. ఏప్రిల్ 1 నుంచి దిల్లిలో 15 ఏళ్లకు మించిన వాహనాలు ఇంధనం నింపకుండా కట్టడి చేయాలని నిర్ణయించింది. అంటే.. దిల్లీ రాజధాని నగరంలో ఇకపై పాత వాహనాలకు ప్రవేశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని అరికట్టే చర్యలపై చర్చించడానికి అధికారులతో సమావేశమైన తర్వాత.. వాహనాల ఉద్గారాలు, కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోందని దిల్లీ పర్యావరణ, అటవీ, వన్యప్రాణుల మంత్రిత్వ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా అన్నారు.
రోజురోజుకు దిల్లీ రోడ్లపై పెరిగిపోతున్న వాహనాలు, పరిశ్రమల కాలుష్యంతో పాటుగా చుట్టు పక్కల రాష్ట్రాల్లో పంటలు కాల్చడం వల్ల వస్తున్న పొగతో రాజధాని ప్రాంతం గ్యాస్ ఛాంబర్ లా తయారైంది. గట్టిగా ఊపిరి పీల్చుకుంటే విషపూరిత రసాయనాలను, ప్రాణాల మీదకు తెచ్చే రోగాలను కొని తెచ్చుకున్నట్లే ఉంటుంది. ఈ పరిస్థితల కారణంగా.. అక్కడ బడి పిల్లల నుంచి పండు ముసలి వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయినా.. అక్కడి పరిస్థితుల్లో మార్పులు రావడం లేదు. దాంతో.. నూతన ప్రభుత్వం సరికొత్త, ప్రభావంతమైన చర్యలు అమలు చేయాలని భావిస్తోంది.
అధికారులతో సమావేశం తర్వార మీడియాతో మాట్లాడిన పర్యావరణ శాఖ మంత్రి సిర్సా.. ఈ ఏడాది చివరి నాటికి రాష్ట్రంలో దాదాపు 90% CNG బస్సులను సైతం ఉపసంహరించుకోనున్నట్లు తెలిపారు. వాటి స్థానంలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులనే ప్రవేశపెడతామని మంత్రి ప్రకటించారు. గత 15 ఏళ్లుగా.. దిల్లీలో కాలుష్యాన్ని అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించిన పర్యావరణ శాఖ మంత్రి.. కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు సైతం నిరుపయోగంగానే ఉన్నాయని తెలిపారు. కానీ.. ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ కారణంగా.. పర్యావరణాన్ని కాపాడే చర్యలు వేగవంతం అయ్యాయని, ఇప్పటి నుంచి ప్రభావంతమైన చర్యలుంటాయని ప్రకటించారు.
ధూళి కాలుష్యం, వాహన కాలుష్యం, నిర్మాణ కాలుష్యం కారణంగా దిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటుందని చెప్పిన మంత్రి సిర్సా.. దిల్లీలో కాలుష్యాన్ని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ వైపు చూస్తోందని వెల్లడించారు. అలాగే.. దిల్లీలోని ఎత్తైన భవనాల పై యాంటీ-స్మోగ్ గన్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అన్ని హోటళ్ళు, వాణిజ్య సముదాయాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. అలాగే.. నగరంలో భారీ వాణిజ్య వాహనాలను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని, అవి..నిబంధనల ప్రకారం పని చేస్తున్నాయా, లేదా అన్నది తనిఖీ చేస్తామని అన్నారు. అలాగే.. వాటిని రోడ్లపైకి అనుమతించిన సమయానికే చేరుకుంటున్నాయా లేదా అన్నది పరిశీలించేందుకు ఈ బృందం పని చేయనుందని తెలిపారు.
Also Read : Citibank : కస్టమర్ ఖాతాలో రూ.700 లక్షల కోట్లు జమ – ఆ ఆనందం రెండు నిముషాలే.
దిల్లీలో అత్యవసరంగా కాలుష్యాన్ని కట్టడి చేయాలన్న పర్యావరణ శాఖ మంత్రి.. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న భూములలో ప్రత్యేకంగా మొక్కలు నాటుతామని, వాటిని పట్టణ అడవులుగా మారుస్తామని తెలిపారు. యూనివర్శిటీ విద్యార్థులు, కాలేజీ విద్యార్థుల సాయంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేకంగా మొక్కలు నాటే కార్యక్రమాల్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో.. రాష్ట్రంలోని పరిశ్రమలు, నిర్మాణ రంగంలోని సంస్థలు కచ్చితంగా నియమాలను పాటిస్తున్నాయో, లేదో తెలుసుకోవడానికి ప్రత్యక్ష తనిఖీలు చేపడతామని ప్రకటించారు.