సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేసి, వాటి ద్వారా తెలిసినవారిని డబ్బులు అడగటం ఇటీవల చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. ప్రముఖుల ఖాతాలు కూడా వీటికి అతీతమేం కాదు, అయితే వారి ఖాతాల్ని హ్యాక్ చేసిన వారు ఏం చేస్తారు? వారిని ఎలా ఇబ్బంది పెడతారనేది ఎవ్వరూ అంచనా వేయలేని విషయం. అయితే కొన్నిసార్లు హ్యాకర్లు జస్ట్ శాంపిల్స్ రుచి చూపిస్తారంతే. తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే విషయంలో కూడా ఇదే జరిగింది. మరింత నష్టం జరగకముందే సైబర్ టీమ్ యాక్టివ్ కావడంతో ఆయన ట్విట్టర్(X) ఖాతా తిరిగి పునరుద్ధరణకు గురైంది.
ఏం పోస్ట్ చేశారు..?
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే X ఖాతాను హ్యాకర్లు తమ అధీనంలోకి తీసుకున్నారు. వెంటనే ఆయన ఖాతానుంచి పాకిస్తాన్, టర్కీ జెండాలను పోస్ట్ చేశారు. ఏక్ నాథ్ షిండే ట్విట్టర్ ఖాతాలో పాకిస్తాన్, టర్కీ జెండాలు ప్రత్యక్షం కావడంతో ఫాలోవర్లు షాకయ్యారు. అసలాయన ఆ పని ఎందుకు చేశారంటూ ఆరా తీశారు. తిరిగి ఆయనకే మెసేజ్ లు పెట్టారు. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వెంటనే సైబర్ టీమ్ అప్రమత్తం అయింది. ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని తెలుసుకుని దాన్ని తిరిగి రీస్టోర్ చేసే పని మొదలు పెట్టింది. అరగంటనుంచి 40 నిమిషాలు టైమ్ పట్టింది. ఆ తర్వాత అంతా సవ్యంగా మారింది. డిప్యూటీసీఎం ఏక్ నాథ్ షిండే X అకౌంట్ తిరిగి రీస్టోర్ అయింది.
భారత్ బదులు పాక్ జెండాలు..
ఈరోజు ఆసియా కప్లో భారత్, పాకిస్థాన్ తో తలబడాల్సి ఉంది. సహజంగా భారత్ కి మద్దతుగా ఏక్ నాథ్ షిండే ట్వీట్ చేయాల్సి ఉంది. భారత్ జెండా ఉండాల్సిన చోట పాక్ జెండా ఉండటంతో నెటిజన్లు షాకయ్యారు. అసలు ఏక్ నాథ్ షిండే పాకిస్తాన్ కు ఎందుకు మద్దతు తెలిపారా అని అనుకున్నారు. టర్కీ జెండా కూడా ఉండటంతో ఆసియా కప్ నే టార్గెట్ చేసుకుని హ్యాకర్లు ఆ రెండు దేశాల జెండాలు ఉంచారనే అనుమానం బలపడింది. ఆ దిశగా సైబర్ టీమ్ ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టింది.
ఎవరిపని?
ఇటీవల అసోంకి చెందిన కాంగ్రెస్ నాయకుడి X ఖాతా కూడా ఇలాగే హ్యాకింగ్ కి గురైంది. అందులో ఆయనకు వ్యతిరేక పోస్ట్ లు కనిపించాయి. ఇప్పుడు మహారాష్ట్ర డిప్యూటీసీఎం X ఖాతా హ్యాకింగ్ కి గురైన విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాక్షాత్తూ ఒక డిప్యూటీ సీఎం సోషల్ మీడియా పాస్ వర్డ్ క్రాక్ చేయడం సామాన్యులకు సాధ్యమవుతుందా, ఇది ఆకతాయిల పనా, లేక దీని వెనక పాకిస్తాన్ కుట్ర ఉందా అనే ఎంక్వయిరీ మొదలైంది. భారత్ లో చాలామంది ప్రముఖులు, తమ X ఖాతాల ద్వారానే అధికారిక సమాచారాన్ని బహిర్గతం చేస్తుంటారు. ఇలాంటి సమయంలో X ఖాతాలు కూడా హ్యాకర్ల పాలిట పడితే ఇక జనం ఏది నమ్మాలి అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. దీనిపై ఏక్ నాథ్ షిండే ఇంకా స్పందించలేదు. ఈ పని ఎవరిదో తేలాల్సి ఉంది.