Train Accidents in India(Morning news today telugu) : ఒడిషాలో జరిగిన రైలు దర్ఘటన భారత రైల్వే చరిత్రలో అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. గతంలో ఎన్నో విషాదకర ఘటనలు జరిగాయి. 1981లో బిహార్లోని సహస్ర వద్ద ఓ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ రైలు భాగమతి నదిలో మునిగిపోయింది. దీంతో 500 మంది మృత్యువాతపడ్డారు. భారత్ లో ఓ రైలు ప్రమాదంలో ఇంతమంది చనిపోవడం అదే మొదటిసారి. 1995లో ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ వద్ద ఢిల్లీ వెళుతున్న పురుషోత్తమ్ ఎక్స్ప్రెస్.. కలిండ్ ఎక్స్ప్రెస్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 358 మంది ప్రాణాలు కోల్పోయారు.
1999లో అసోంలోని గైసోల్ వద్ద రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 290 మంది చనిపోయారు. ప్రమాద తీవ్రతకు పేలుడు కూడా సంభవించింది. 1998లో కోల్కతా వెళుతున్న సమయంలో జమ్ముతావి ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. పక్క ట్రాక్ పై వెళ్తున్న గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్రెస్ బోగీలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 212 మంది ప్రాణాలు కోల్పోయారు.
2002లో హౌరా నుంచి న్యూఢిల్లీ వెళుతున్న రాజధాని ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 140 మంది మృతిచెందారు. 2010లో హౌరా నుంచి ముంబై వెళుతున్న లోకమాన్య తిలక్ – జ్ఞానేశ్వరి ఎక్స్ప్రెస్ రైలు.. పేలుడు వల్ల పట్టాలు తప్పి గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో 170 మంది మృత్యువాతపడ్డారు.
2016లో ఇండోర్ నుంచి పట్నా వెళుతున్న ఎక్స్ప్రెస్ కాన్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 150 మంది చనిపోయారు. 2005లో తెలంగాణలోని వలిగొండ వద్ద ఒక్కసారిగా వచ్చిన వరదకు రైలు వంతెన కొట్టుకుపోయింది. దీంతో డెల్టా ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 114 మంది దుర్మరణం చెందారు. ప్రస్తుతం కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఘటనలో ఇప్పటికే 280 మంది మృతి చెందగా.. ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.