
Chhattisgarh: అసలే ఛత్తీస్గఢ్. అందులోనూ దంతేవాడ. మావోయిస్టుల అడ్డా. ఆ దండకారణ్యంలో ఈ మధ్య పోలీసుల హడావుడి కూడా పెరిగింది. మావోయిస్టులపై పైచేయి సాధించేందుకు భద్రతా బలగాలు స్పెషల్ ఆపరేషన్ చేపడుతున్నాయి. కోబ్రా టీమ్స్తో అడవుల్ని జల్లెడ పడుతున్నాయి.
ఓ చోట మావోయిస్టుల కదలికలు ఉన్నాయని డీఆర్జీ ఫోర్సెస్కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వెంటనే కూంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. కానీ, మావోయిస్టుల జాడ కనిపించలేదు. నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు. అయితే, పోలీసులను ఇన్ఫర్మేషన్ పేరుతో అడవుల్లోకి రప్పించి ట్రాప్ చేశారనే విషయం ఆ సమయానికి వారికి తెలీదు. ఇకముందు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే…
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ బలగాలు ప్రయాణిస్తున్న మినీ బస్సును.. ఐఈడీతో పేల్చేశారు మావోయిస్టులు. ఆ పేలుడుకు బస్సులో ఉన్న పోలీసులంతా స్పాట్లోనే చనిపోయారు. మొత్తం 13 మంది జవాన్లు మృత్యువాత పడ్డాడు. పేలుడు తీవ్రతకు వాహనం ముక్కలు ముక్కలైంది. 50 కేజీల పేలుడు పదార్ధాలు ధాటికి.. 20 అడుగుల ఎత్తులో ఎగిరిపడింది వాహనం. ఐదు అడుగుల లోతులో భారీ గొయ్యి ఏర్పడింది. సోల్జర్స్ శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. బాంబు దాడితో దంతేవాడ మరోసారి ఉలిక్కిపడింది.
విషయం తెలిసి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎంకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు, మావోయిస్టుల వేటకు మరింత మంది బలగాలు రంగంలోకి దిగాయి. దంతేవాడ అడవుల్లో విస్తృత కూంబింగ్ చేపట్టాయి.