Two killed in Fire Accident : ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ ప్రాంతంలో గల ఒక ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి అగ్నిప్రమాదం జరిగింది. తలనగరి ప్రాంతంలో.. ఇనుమును కరిగించే కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు కార్మికులు సజీవదహనమవ్వగా.. డజన్ మందికి పైగా వర్కర్లు తీవ్రగాయాల పాలయ్యారు. వారిలో ఆరుగురికి పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఫ్యాక్టరీలో అమర్చి ఉన్న ఫర్నేస్ లో ఇనుమును కరిగిస్తున్న సమయంలో పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.
పేలుడు ఘటన తర్వాత.. కంపెనీ నుంచి మంటలు భారీగా ఎగసి పడటంతో.. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇనుమును కరిగిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లు మృతుల్లో ఒకరి బంధువులు తెలిపారు. ఇనుము లావా కొందరు యువకులపై పడటంతో.. వారు కూడా గాపడ్డారు.
ఇంత పెద్ద ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ నిర్వాహకులు పట్టించుకోలేదని వాపోతున్నారు. ప్రమాద ఘటనపై జిల్లా మెజిస్ట్రేట్ కు సమాచారమివ్వగా.. రెస్క్యూ టీమ్ ఫ్యాక్టరీకి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.