G-20 : శ్రీనగర్లో జీ-20 సదస్సు కోసం సర్వం సిద్ధమైంది. నేటి నుంచి 3 రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. భద్రతా దళాలు నిఘాను మరింత పెంచాయి. ఎన్ఎస్జీకి చెందిన కౌంటర్ – డ్రోన్ దళాలు గగనతలం నుంచి పహారా కాస్తున్నాయి. నౌకాదళానికి చెందిన మెరైన్ కమాండోలు దాల్ సరస్సులో నిరంతంరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. భద్రతా సిబ్బంది మైదాన ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని పహారా కాస్తున్నారు.
షేర్ ఏ కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో జీ-20 పర్యాటక వర్కింగ్ గ్రూప్ మూడో భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సదస్సుకు 60 మంది విదేశీ ప్రతినిధులు, 20 మంది పాత్రికేయులు రానున్నారు. ఇంతకుముందు గుజరాత్లోని రణ్ ఆఫ్ కచ్, పశ్చిమ బెంగాల్లోని సిలిగుడీలో సమావేశాలు నిర్వహించారు. ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్మూకశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక ఇక్కడ జరుగుతున్న తొలి అంతర్జాతీయ కార్యక్రమమిది. ఎన్నికల విధుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన 30 కంపెనీల సీఆర్పీఎఫ్ దళాలు తిరిగి జమ్మూకశ్మీర్కు చేరుకున్నాయి.
ఈ సమావేశమే లక్ష్యంగా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రవాదులు 26/11 తరహా దాడులకు పన్నాగం పన్నినట్లు సమాచారం వచ్చింది. దీంతో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఐఎస్ఐ ఉగ్రవాదుల కోసం పని చేస్తున్న ఓ వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారించాయి. అతడు సదస్సు నిర్వహించే కన్వెన్షన్ సెంటర్లోనే ఉద్యోగం చేస్తున్నాడని గుర్తించారు. అతడు చెప్పిన వివరాల ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడేందుకు ప్లాన్ చేశారని గుర్తించారు.
భద్రతాచర్యల్లో మార్పులు చేపట్టారు. ముంబై దాడుల తరహాలో ఉగ్రవాదులు సదస్సు జరిగే ప్రాంతంలోకి చొరబడి కాల్పులు జరిపేందుకు పన్నాగం పన్నినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే గుల్మార్గ్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. మొబైల్ నెట్వర్కులను నిశితంగా పరిశీలిస్తున్నారు. అంతర్జాతీయ కాల్స్పై దృష్టి పెట్టారు.
ఉగ్రవాదుల దాడుల్లో ఓవర్గ్రౌండ్ వర్కర్లు కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం అదుపులోకి తీసుకున్న వ్యక్తి కూడా అలాగే పనిచేస్తున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరి అండతోనే హిజాబుల్ ముజాహిదీన్, జైష్ ఏ మహ్మద్ లాంటి ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి.