![](https://bigtvlive.com/wp-content/uploads/2022/11/modi-10.jpg)
G20 : G20 దేశాల అధ్యక్ష బాధ్యతలు భారత్ చేతికి వచ్చాయి. ఇండోనేషియా నుంచి భారత్ జి-20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించింది. రెండురోజులపాటు ఇండోనేషియాలోని బాలిలో జి-20 సదస్సు జరిగింది. G20 బాధ్యతలు దేశానికి రావడం భారతీయులు గర్వించదగ్గ విషయమని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు.
ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడోడో నుంచి G-20 అధ్యక్ష బాధ్యతలు అందుకుంటున్న చిత్రాన్ని విదేశాంగ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విటర్లో షేర్ చేశారు. బాలిలో సమావేశమైన నేతలంతా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపాలని రష్యాకు సూచించారు. ఈ అంశంపై డిక్లరేషన్ ప్రకటించారు. గతంలో రష్యాకు ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని ప్రస్తావించారు. అణుబెదిరింపులు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదని డిక్లరేషన్ లో పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరారు. ఇది యుద్ధాల యుగం కాదని G20 దేశాలు స్పష్టం చేశాయి.
సెప్టెంబర్లో షాంఘై కోఆపరేషన్ సమ్మిట్కు హాజరైన సమయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్, భారత్ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అప్పుడు ఇది యుద్ధాల యుగం కాదని పుతిన్కు మోదీ సూచించారు. యుద్ధాన్ని ముగించేందుకు ప్రయత్నిస్తానని పుతిన్ చెప్పారు. అప్పుడు మోదీని ప్రపంచదేశాలు ప్రశంసించాయి. వివిధ దేశాల మీడియాలు మోదీ స్టేట్ మెంట్ ను ప్రస్తావించాయి.