PM Modi On GST 2.O: జీఎస్టీ 2.0 సంస్కరణలు అమలులోకి రానున్న కొన్ని గంటల ముందు ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రేపు రెండు పండుగలు చేసుకోబోతున్నామని చెప్పారు. అవి నవరాత్రి, జీపీఎస్టీ తగ్గింపు పండుగలు అన్నారు. నాగరిక్ దేవోభవ నినాదంతో ముందుకెళ్తున్నామన్న ప్రధాని.. స్వదేశీ మంత్రం పాటించాల్సిన సమయం వచ్చిందన్నారు.
మనం నిత్యం అనేక విదేశీ వస్తువులు వాడుతున్నామని, వీటి వాడకం తగ్గించాలని ప్రధాని మోదీ సూచించారు. భారత్లో తయారైన వస్తువుల వినియోగించాలని కోరారు. ప్రతి పౌరుడు స్వదేశీ ప్రతిజ్ఞ తీసుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. సోమవారం నుంచి జీఎస్టీ ఉత్సవ్ ప్రారంభం కాబోతోందన్నారు. తదుపరి తరం జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వస్తున్నాయని, దీంతో అన్ని రంగాలకు ఎంతో ఉపయోగకరం అన్నారు.
దేశ ప్రజలకు ప్రధాని మోదీ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ..”రేపు శక్తిని పూజించే పండుగ నవరాత్రి ప్రారంభమవుతోంది. మీ అందరికీ నా శుభాకాంక్షలు. నవరాత్రి మొదటి రోజున దేశం ఆత్మనిర్భర్ భారత్ వైపు మరో పెద్ద అడుగు వేస్తోంది” అని అన్నారు.
‘రేపు తదుపరి తరం GST సంస్కరణలు అమలు చేసుకోబోతున్నాం. GST పొదుపు పండుగ ప్రారంభం కానుంది. మీ పొదుపు పెరుగుతుంది. ఇకపై మీకు ఇష్టమైన వస్తువులను సులభంగా కొనుగోలు చేయవచ్చు” అని ప్రధాని మోదీ అన్నారు. జీఎస్సీ సంస్కరణలతో పేదలు, మధ్యతరగతి, యువకులు, మహిళలు, వ్యాపారులకు ఎంతో ప్రయోజనం పొందుతారని ప్రధాని అన్నారు.
“జీఎస్టీ సంస్కరణలు భారత్ వృద్ధిరేటును వేగవంతం చేస్తాయి. వ్యాపార సౌలభ్యాన్ని పెంచుతాయి. ఎక్కువ పెట్టుబడులను ఆకర్షిస్తాయి. ప్రతి రాష్ట్రం దేశ అభివృద్ధిలో సమాన భాగస్వామిగా మారేలా చేస్తాయి. 2017లో తమ ప్రభుత్వం జీఎస్టీని తీసుకురావడానికి చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా మన ప్రజలు వివిధ పన్నుల వలయంలో చిక్కుకున్నారు. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జీఎస్టీ అమలుకు ప్రాధాన్యత ఇచ్చాము. అన్ని రాష్ట్రాల మద్దతుతో జీఎస్టీ పన్ను సంస్కరణలను అమలు చేయగలిగాము” అని మోదీ అన్నారు.
జీఎస్టీ 2.0లో 12 శాతం, 28 శాతం పన్ను శ్లాబులను తొలగించి 5 శాతం, 18 శాతం శ్లాబులను మాత్రమే కొనసాగిస్తున్నామని ప్రధాని మోదీ తెలిపారు. కాఫీ, నెయ్యి, బిస్కెట్లు, నూనె వంటి రోజువారీ నిత్యావసర వస్తువులు రేపటి నుంచి చౌకగా మారనున్నాయన్నారు. కొత్త కార్ల ధరలు తగ్గనున్నాయి. ఆరోగ్య బీమా కవరేజ్ ప్రీమియంలు కూడా తగ్గుతాయి. ఈ సంస్కరణలు పండుగ సీజన్లో ప్రజలకు మరింత ఆనందాన్ని కలిగించనున్నాయి.
Also Read: అమలులోకి కొత్త రూల్స్.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!
మేక్ ఇన్ ఇండియాకు మద్దతు తెలపాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు. “మనం ప్రతి ఇంటిని స్వదేశీ చిహ్నంగా మార్చాలి. ప్రతి దుకాణాన్ని స్వదేశీ ఉత్పత్తులతో అలంకరించాలి. నేను స్వదేశీ వస్తువులను కొంటాను, నేను స్వదేశీ వస్తువులనే అమ్ముతాను” అని గర్వంగా చెప్పాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.