Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లోని కొండ ప్రాంతాల్లో ప్రయాణం ఎంత అందంగా ఉంటుందో, ఒక్కోసారి అంతకంటే ఎక్కువ ప్రమాదకరంగా మారుతుంది. తాజాగా చంబా జిల్లాలో చోటుచేసుకున్న ఓ విషాదకర సంఘటన అక్కడ ప్రయాణించే వారిని తీవ్ర భయాందోళనకు గురిచేసింది.
పంగీ-కిలాద్ ప్రధాన రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం వేళ వాహనాల రాకపోకలు యథాతథంగా సాగుతున్న సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది. హఠాత్తుగా కొండచరియలు విరిగిపడి, బాటసారులపైకి పెద్ద పెద్ద బండరాళ్లు దూసుకొచ్చాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక కారుపై ఈ కొండచరియలు పడటంతో, వాహనం క్షణాల్లో నుజ్జునుజ్జయిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే 13 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక అధికారులు, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. బండరాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలను బయటకు తీశారు.
ఈ ప్రమాదంలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా.. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో ప్రయాణించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఈ సందర్భంగా ప్రయాణికులను హెచ్చరిస్తున్నారు.
Also Read: మన్మోహన్ సింగ్ కాలాన్ని గుర్తు చేస్తూ.. కేంద్రానికి కోమటిరెడ్డి ఘాటు కౌంటర్!