Komatireddy: నీట్ పరీక్షా పత్రాల లీకేజీల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. లక్షలాది మంది యువత రాత్రింబవళ్లు కష్టపడి చదివి పరీక్షలు రాస్తుంటే.. వరుస లీకేజీల వల్ల మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
యూపీఏ నుంచి నేటి ఎన్డీయే పాలన వరకు ప్రశ్నాపత్రాలు లీక్ కావడం ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. మాటల మీద ఉన్న శ్రద్ధను పరీక్షల నిర్వహణలో చూపకపోవడం దారుణమన్నారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడాన్ని, ప్రధాని నివాస ముట్టడికి దిగిన ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని ఖండించారు.
గతంలో మన్మోహన్ సింగ్ హయాంలో చిన్న ఆరోపణలకే మంత్రులు రాజీనామా చేశారని గుర్తుచేశారు. ఈ లీకేజీలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని, ప్రధాని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.