AAP: ఆర్థిక నేరాల్లో చాలా వరకు ముందుగా ఆధారాలు లభించవు. కొన్ని అనుమానాలు, ఆరోపణల నుంచి దర్యాప్తు మొదలవుతుంది. ఆ తర్వాత నేరం ఎలా జరిగి ఉంటుందనే కోణంలో విచారణ జరుగుతుంది. అందుకు అనుగుణంగా ఆధారాలను దర్యాప్తు ఏజెన్సీలు సేకరిస్తాయి. అప్పుడు నేరాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కూడా ఈడీ అలాంటి పనే చేస్తున్నది.
ఢిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేసి రూ. 100 కోట్ల వరకు అక్రమార్జన చేశారనే ఆరోపణలను దర్యాప్తు సంస్థలు చేస్తున్నాయి. ఇందులో నుంచి రూ. 45 కోట్లు గోవా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రచారం కోసం ఆప్ ఖర్చు పెట్టిందని ఆరోపిస్తున్నాయి. మరి ఆ డబ్బులు ఎలా గోవాకు చేరాయి? ఇందులో ఎవరు కీలకంగా వ్యవహరించారు? ఈ వివరాలు ఈడీ తన చార్జిషీటులో నమోదు చేసింది. ఓ జాతీయ చానెల్ ఈడీ చార్జిషీటును యాక్సెస్ చేసింది. అందులో కొన్ని ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈడీ తన చార్జిషీటులో లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ పాత్రను తాము గుర్తించినట్టు పేర్కొంది. అరవింద్ కేజ్రీవాల్తోపాటు ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఒక నిందితురాలిగా చేర్చింది. ఒక జాతీయ పార్టీని దర్యాప్తు సంస్థలు తమ చార్జిషీటులో అక్యూస్డ్గా పేర్కొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కేజ్రీవాల్ను కింగ్పిన్గా పేర్కొంటూ 37వ నిందితుడిగా.. ఆప్ను 38వ నిందితురాలిగా పేర్కొంది.
రూ. 45 కోట్ల వరకు హవాలా మార్గాల్లో గోవాకు చేరాయని, ఆ చేరిన డబ్బులను ఆప్ ఖర్చు పెట్టిందని ఈడీ ఆరోపించింది. ఆ విధంగా ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ డబ్బులు సేకరించడం, ఖర్చుపెట్టడం, ఈ నేరానికి సంబంధించి వివరాలను గుప్తంగా ఉంచారనీ పేర్కొంది. గోవాకు చేరిన ఈ డబ్బులను చారియట్ ప్రొడక్షన్ ఉద్యోగి చన్ప్రీత్ సింగ్ మేనేజ్ చేశాడని, ఇందుకుగాను ఆయనకు ఆప్ రూ. 1 లక్ష అందించింని తెలిపింది.
అలాగే.. విచారణను కేజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారని నిరూపించడానికి ఆయనకు, మనీష్ సిసోడియా మాజీ సెక్రెటరీ సీ అరవింద్కు మధ్య జరిగిన చాటింగ్ను ఈడీ ప్రస్తావించింది. కేజ్రీవాల్ అనుచరుడు వినోద్ చౌహాన్ నేరుగా హవాలా వ్యాపారులతో ఇంటరాక్ట్ అయ్యారని ఆరోపించింది. గోవాకు రూ. 25 కోట్లు హవాలా మార్గంలో ఆయనే పంపించారని తెలిపింది. ఈ ఏడాది మే నెలలో వినోద్ అరెస్టయ్యాడు. సౌత్ గ్రూప్నకు చెందిన అభిషేక్ బోయినపల్లి మరో నిందితుడికి రెండు బ్యాగుల డబ్బులు ఇవ్వగా.. అవి వినోద్ చౌహాన్కు చేరినట్టు ఈడీ వివరించింది. ఇలా డబ్బులను ఆప్ గోవాకు తరలించుకుని ప్రచారానికి ఖర్చు పెట్టిందని చార్జిషీటులో ఈడీ తెలిపింది.