సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఉల్లంఘించిందంటూ ఐక్యరాజ్యసమితిలో మన దేశంపై నిందలు వేయాలనుకుంది పాకిస్తాన్. నీరు ప్రాణాధారం అని, అది యుద్ధంలో ఆయుధం కాబోదంటూ ఐక్యరాజ్యసమితి మీటింగ్ లో నీతివాక్యాలు వల్లించారు పాకిస్తాన్ ప్రతినిధి. ఆ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్. పాకిస్తాన్ చేసిన దారుణాల్ని ఆయన ఎండగట్టారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో పాకిస్తాన్ 20వేలమంది భారత పౌరుణల మరణాలకు కారణం అయిందని ఆయన తెలిపారు. ఆ 20వేల మందిని పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ కి భారత్ ఉదారంగా నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.
పహల్గామ్ దాడి తర్వాతే..
ఇప్పుడు కూడా భారత్ అకారణంగా నీళ్లు ఆపలేదని, పహల్గాం దాడిలో 26మంది అమాయక పౌరుల్ని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నాక మాత్రమే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. సింధూ జలాల విషయంలో భారత్ ఒప్పందాల్ని ఉల్లంఘించినట్టు అంతర్జాతీయ వేదికలపై పాక్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాద చర్యల అనంతరం ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చినంతకాలం సింధూ జలాల విషయంలో తమ వైఖరి మారబోతని హరీష్ స్పష్టం చేశారు. పాక్ మనసు మార్చుకున్న తర్వాతే సింధూ జలాల విషయంలో తాము పునరాలోచిస్తామన్నారాయన.
ఉగ్రవాదులకు పాక్ ప్రోత్సాహం..
1960 ఏప్రిల్ 23న భారత్-పాకిస్తాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం జరిగింది. సింధూ నదికి ఎగువ దేశమైన భారత్ ఉదారంగా నీటిని పాకిస్తాన్ కి ఇస్తోంది. అయితే పాకిస్తాన్, భారత్ నే టార్గెట్ చేసి ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. భారత్ ఉదారంగా ఉంటే, పాకిస్తాన్ మన దేశ నాశనాన్ని కోరుకుంటోంది. ఇలాంటి సమయంలో శత్రువుకి మేలు చేయాలంటే ఎలా అని భారత్ ప్రశ్నిస్తోంది. సింధూ జలాల ఒప్పందాన్ని కొనసాగించాలంటున్న పాకిస్తాన్.. 65 ఏళ్లలో భారత్ తో మూడు యుద్ధాలు ఎందుకు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రశ్నిస్తున్నారు. వేలాది ఉగ్రవాద దాడులకు ప్రోత్సాహం అందించిన పాకిస్తాన్ కు, సింధూ నదీ జలాల్లో వాటా అడిగే హక్కు ఎక్కడిదని నిలదీస్తున్నారు.
దాడులు చేసినా సహనంగానే భారత్..
గతంలో దాడులు జరిగినప్పుడు కూడా భారత్.. సహనం, ఉదారత ప్రదర్శించిందని గుర్తు చేస్తున్నారు మన అధికారులు. తమ మంచితనాన్ని అలుసుగా తీసుకున్న పాకిస్తాన్.. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ.. భారత దేశంలో పౌరుల జీవితాలను, మత సామరస్యాన్ని, ఆర్థిక శ్రేయస్సును దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో సింధూ నదిపై నిర్మించిన ఆనకట్ట మరమ్మతులను కూడా పాక్ అడ్డుకుందని గుర్తు చేశారు. 2012లో జమ్మూ కాశ్మీర్లోని తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్ట్పై ఉగ్రవాదులు దాడి చేశారని ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధి హరీష్ గుర్తు చేశారు. ఇలాంటి చర్యలు భారత దేశంలోని సాగునీటి ప్రాజెక్టుల భద్రతకు, పౌరుల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నాయని ఆయన చెప్పారు. సింధూ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించింది భారత్ కాదని, ముమ్మాటికీ పాకిస్తానేనని చెప్పారాయన.